1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Revanth Accuses BRS, Kishan Reddy of Causing Metro Phase-2 Delay

అంతా బీఆర్ఎస్ వల్లే జరిగింది.. కిషన్ రెడ్డి అడ్డుకున్నారు.. రేవంతన్న ఫైర్

Revanth Reddy
Revanth Reddy
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చారిత్రక కట్టడాల పరిరక్షణ సాకుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో మొదటి దశను అడ్డుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రాజెక్టు మూడేళ్లు ఆలస్యమై, కేవలం రూ.15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో వ్యయం ఏకంగా రూ. 22,000 కోట్లకు చేరిందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
గత ప్రభుత్వం మెట్రో విస్తరణను నిర్లక్ష్యం చేయడం వల్లే అగ్రస్థానంలో ఉండాల్సిన హైదరాబాద్ మెట్రో ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రజా ప్రభుత్వం రాగానే మెట్రో ఫేజ్-2 విస్తరణపై దృష్టి పెట్టామని, అయితే ఫేజ్-1 నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థే ఫేజ్-2 కూడా కట్టాలని కేంద్రం నిబంధన పెట్టిందని సీఎం తెలిపారు. 
 
తమ ప్రభుత్వం జపాన్ దేశానికి చెందిన ఒక సంస్థ ద్వారా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కేవలం 4 శాతం వడ్డీకే రూ. 13,600 కోట్ల అప్పును తీసుకువచ్చిందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన రూ. 1,400 కోట్లను ఇప్పటికే చెల్లించిందని సీఎం వెల్లడించారు.

అయితే, ఇవాళ విడుదల కావాల్సిన ఈ లోన్ బదిలీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావాలనే అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.  కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పరిధిలోనే ప్రధానంగా మెట్రో విస్తరణ జరగాల్సి ఉన్నప్పుడు, ఆయన ఎందుకు బాధ్యత తీసుకోరని నిలదీశారు. చివరిగా, కిషన్ రెడ్డి వెనక కేటీఆర్ ఉన్నారని, కేటీఆర్ కుట్రలకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో బంగారు గొలుసులు లాక్కున్న దుండగులు