బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (17:39 IST)

"మా" ఎగ్జిక్యూటివ్ సభ్వత్వానికి చిరంజీవి రాజీనామా

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) క్రమ శిక్షణా సంఘానికి చిరంజీవి రాజీనామా చేశారు. హీరో నరేష్‌ అధ్యక్షతన 2019 మార్చిలో ఏర్పాటైంది. ఈ ప్యానల్‌ పాలనా కాలం ముగిసింది. ప్యానెల్‌ ఏర్పాటైనప్పుడు కొంత కాలం బాగానే ఉన్నా, తర్వాత 'మా' ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు రెండుగా విడిపోయారు. 
 
సీనియర్ హీరోలు కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్‌ జయసుధ వంటివారు వీరిని కలపడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 'మా' డైరీ ఆవిష్కరణ సమయంలో నరేష్‌, రాజశేఖర్‌ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. 
 
ఆ సమయంలో కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్‌ జయసుధలతో ఓ క్రమశిక్షణా సంఘం ఏర్పాటైంది. ఆ సంఘం చర్యలు తీసుకోకముందే రాజశేఖర్‌ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. జీవిత మాత్రం కార్యదర్శిగా కొనసాగుతూ వచ్చారు. 
 
భేదాభిప్రాయాలు సద్దుమణగక ముందే కరోనా వచ్చింది. ఆ సమయంలో చిరంజీవి ముందుండి సీసీసీ అనే సంస్థను ఏర్పాటు చేసి.. విరాళాలు సేకరించి సినీ కార్మికులను ఆదుకున్నారు. కోవిడ్‌ ప్రభావం నుంచి ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే బయటపడే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో మా ఎన్నికలకు సమయం దగ్గర పడింది. 
 
ఈ సమయంలో ఇన్నాళ్లూ 'మా' వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరించిన చిరంజీవి క్రమశిక్షణా సంఘానికి రాజీనామా చేశారు. అయితే చిరంజీవి రాజీనామాను ఎవరూ ధృవకరించలేదు. 'మా' సభ్యుల్లో సఖ్యత లేకపోవడమో, మనసు నొచ్చుకోవడమో ఏమో కానీ చిరంజీవి రాజీనామా చేశారని మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.