1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 21 అక్టోబరు 2018 (09:32 IST)

వైజాగ్ ప్రసాద్ ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూత

నాటక రంగం నుంచి బుల్లితెరకు ఆపై వెండితెరపై కనిపించిన వైజాగ్ ప్రసాద్ ఇకలేరు. ఆయన అనారోగ్యంతో ఆదివారం వేకువజామున కన్నుమూశారు. ఆయన వయసు 75 యేళ్లు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇంటికే ప‌రిమితం అయ్యారు.
 
ఆదివారం వేకువజామున సోమాజిగూడ య‌శోద ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూసారు. వైజాగ్ ప్ర‌సాద్ మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటనిని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని, వారి కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి సినీ ప్ర‌ముఖులు, అభిమానులు తెలియ‌జేస్తున్నారు. 
 
ఇదిలావుండగా, వైజాగ్ ప్ర‌సాద్ దాదాపు 170కి పైగా సినిమాల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించారు. 1983లో వచ్చిన "బాబాయ్ అబ్బాయ్" నటుడిగా ఆయన తొలి సినిమా. తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన "నువ్వు నేను" సినిమాలో క‌థానాయ‌కుడి తండ్రిగా న‌టించి ప‌లు ఆఫ‌ర్స్ పొందారు. ఆ తర్వాత 'భ‌ద్ర'‌, 'జై చిరంజీవ', 'నీరాజ‌నం', 'జెమ‌ని', 'అల్ల‌రి బుల్లోడు', 'సుంద‌ర‌కాండ'‌, 'రాణీగారి బంగ్లా', 'ఇది మా ప్రేమ క‌థ‌' వంటి అనేక చిత్రాల్లో ఆయన కీలక పాత్రలను పోషించారు. 
 
ఈయన అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. విశాఖపట్నంలోని గోపాలపట్నం ఆయన స్వస్థలం. వైజాగ్ నుంచి సినీ ఇండస్ట్రీకి రావడంతో పేరు వైజాగ్ ప్రసాద్‌గా స్థిరపడిపోయింది. చదువుకునే రోజుల్నుంచే నాటకాల్లో నటించేవాడు. బీఏ పూర్తి చేసిన ఈయనకు భార్య విద్యావ‌తి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ కంప్యూటర్ ఇంజనీర్లు. అమ్మాయి అమెరికాలో నివాసం ఉండగా అబ్బాయి లండన్‌లో ఉంటున్నాడు.