శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 3 జూన్ 2021 (17:47 IST)

ఆనందయ్య కరోనా మందు: ఆన్‌లైన్‌లో లేదూ ఆవకాయ బద్దా లేదు, కృష్ణపట్నంలో ఎగబడుతున్న జనం

ఆనందయ్య కరోనా మందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కానీ ఆ మందుతో కరోనా తగ్గుతుందని గ్యారెంటీగా చెప్పలేమని తేల్చింది. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ ఆనందయ్య మందు కోసం ఎవ్వరూ కృష్ణపట్నం రావద్దని సూచించారు. మందును ఆన్లైన్లో పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ జిల్లా కలెక్టర్ మాటలను అటు ప్రజలు, ఇటు ఆనందయ్య పట్టించుకోవడంలేదు.
 
బుధవారం నాడు ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నం పోర్టు లోని సివిఆర్ కాంప్లెక్సుకు పెద్దఎత్తున జనం తరలివచ్చారు. ఎంతవద్దన్నా నెల్లూరు, కడప, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి భారీగా తదితర ప్రాంతాల నుంచి జనం వచ్చేసారు. వీరందరికీ టోకెన్లు ఇచ్చి మందు పంపిణీ చేసారు ఆనందయ్య.
 
కాగా రాష్ట్రప్రభుత్వం ఆనందయ్య మందును తయారుచేసుకోవడానికి అనుమతి ఇచ్చిన తరువాత ఎప్పుడు మందును తయారుచేసి ఇస్తారా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మూలికలు సమకూర్చుకోవడానికి సమయం పడుతుంది.. తనకు సమయం కావాలంటున్నాడు ఆనందయ్య.
 
అయితే ఇప్పటికే ఆన్లైన్లో ఆనందయ్య మందును డోర్ డెలివరీ చేస్తారంటూ రకరకాల వెబ్‌సైట్లలో ట్రోల్ అవుతున్నాయి. దీంతో జనం ఆ వెబ్‌సైట్లను ఓపెన్ చేసి బుక్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య కొడుకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ఆన్లైన్‌లో ఆనందయ్య మందు పంపిణీకి ఇంకా ఏర్పాట్లు చేయలేదని స్పష్టం చేశారు ఆనందయ్య కుమారుడు శశిధర్. ముందుగా మందును తయారుచేసి సర్వేపల్లి నియోజకవర్గానికే ఇస్తామంటున్నారు. అంతేకాదు ఆ తరువాతే ఆన్లైన్ గురించి ఆలోచిస్తామని చెప్పారు. 
 
ఇప్పటివరకు ఆన్ లైన్ గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. మేమే అధికారికంగా ప్రకటించేంత వరకు ఎవరూ నమ్మవద్దని.. కొంతమంది కావాలనే ఇష్టానుసారం వెబ్‌సైట్ లింక్‌లను వాట్సాప్ గ్రూపులలో ఫార్వర్డ్ చేస్తున్నారని.. ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటున్నారు. అసలు ఆన్‌లైన్లో బుక్ చేసుకోవద్దంటున్నారు ఆనందయ్య కొడుకు శశిధర్.