గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: గురువారం, 23 జులై 2020 (16:01 IST)

వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ ఫోన్, నేను ఎన్టీఆర్ అభిమానినే అన్న ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించిన అంశం నిప్పు రాజేసిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్‍గా తీసుకోవాలని నెల్లూరు నాయకులకు చంద్రబాబు సూచనలు కూడా చేశారు. పెద్దఎత్తున పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసి 'చలో కావలి' అంటూ పిలుపు ఇవ్వాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.
 
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావాలనే విగ్రహాన్ని తొలగించారని దీనికి పోలీసులు కూడా సహకరించారని నెల్లూరు జిల్లా పార్టీ నేతలు చంద్రబాబుకు తెలియజేశారు. అయితే తాజాగా ఇదే అంశం గురించి ఎన్.టి.ఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ , వైసీపీ పార్టీకి చెందిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కు ఫోన్ చేసి విగ్రహం తొలగించాల్సిన అవసరం ఏముందని ఆరా తీశారు.
 
అయితే ఎన్టీఆర్ విగ్రహం యొక్క వీపు భాగం ఆలయానికి ఎదురుగా ఉన్నందున స్థానికులు తొలగించడం జరిగిందని, వివాదస్పదం కాని స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని బాలకృష్ణకు హామీ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్. తాను కూడా చిన్ననాటి నుంచే ఎన్టీఆర్ అభిమానిని అని బాలకృష్ణకు తెలియజేయడం విశేషం.