1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జులై 2020 (12:41 IST)

భర్త గొంతుకోసిన భార్య... చేతిపై ఫోను నంబరు రాసుకుని క్లూ ఇచ్చిన భర్త

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కడతేర్చేందుకు ప్లాన్ వేసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న అక్కసుతో భర్త గొంతుకోసింది. ఆ తర్వాత చనిపోయాడని భావించి ఇంటికి వెళ్లిపోయింది. కానీ, ఆ భర్త.. తన చేతిపై భార్య మొబైల్ నంబరు రాసుకున్నాడు. ఇది పోలీసులకు సరైన ఆధారంగా చిక్కింది. ఈ నంబరుతో ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రంగారెడ్డి జిల్లా ఫారూక్‌నగర్‌ మండలం వెంకన్నగూడకు చెందిన కడావత్‌ రాజు భార్య శాంతి, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌ బండ్లగూడలోని ఓ ఫంక్షన్‌హాల్‌ యజమాని యూసుఫ్‌ అనే వ్యక్తి వద్ద పనిచేస్తూ అక్కడే ఓ గదిలో నివసించేవారు. 
 
ఈ క్రమంలో శాంతికి యూసుఫ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తను అడ్డుతొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆమె తన సోదరుడు శ్రీను, యూసుఫ్‌, అతని స్నేహితుడు జహీర్‌ సహాయంతో రాజును ఈ నెల 10వ తేదీన పడకల్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. పథకం ప్రకారం రాజు గొంతు కోసి చనిపోయాడనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
స్థానికులు గుర్తించి అతన్ని ఆస్పత్రికి తరలించారు. చనిపోతానేమోననే భయంతో రాజు తన చేతిపై ఫోన్‌ నెంబర్లు రాశాడు. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బండ్లగూడలో శాంతి, శ్రీను, యూసుఫ్‌, జహీర్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.