శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2019 (10:40 IST)

కుక్కతోక వంకర : కేసీఆర్ వంచన .. దిక్కుతోచి స్థితిలో జగన్!

'కుక్కతోక వంకర' అన్నది ఓ సామెత. ఈ సామెత ఇప్పటికీ వాడుకలో వుంది. ఎవరైనా ఒకరు చెప్పిన మాట తప్పి నడుచుకుంటే... కుక్క తోక వంకర అన్నట్టుగా వీడి బుద్ధి మారదురా అంటుంటారు. ఇపుడు అచ్చం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలానే నడుచుకున్నారనే వైకాపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సుహృద్భావం పేరుతో ముఖ్యమంత్రి జగన్‌ను వంచనకు గురిచేశారంటూ వారు అభిప్రాయపడుతున్నారు. 
 
అసలు కేసీఆర్ చేసిన నమ్మకద్రోహం ఏంటో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల విభజన కూడా జరగాల్సివుంది. ఇదే అంశంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఉన్న మొత్తం ఉద్యోగులను ఆంధ్రకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చర్యతో ముఖ్యమంత్రి జగన్ ఖిన్నుడైపోయారు. కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు జగన్ సర్కారును ఆత్మరక్షణలో పడేశాయి. 
 
ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొందని, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా విభజన సమస్యలను సామరస్య వాతావరణంలో పరిష్కరిస్తున్నారని ఇంతకాలం ప్రభుత్వపరంగా వినిపిస్తున్న వాదనను తెలంగాణ ప్రభుత్వ ఏకపక్ష ఉత్తర్వులు గట్టి దెబ్బ తీశాయి. 
 
ఈ హఠాత్పరిణామంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వర్గాలు నోరుమెదపడం లేదు. బాధిత ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు గురువారం విజయవాడలోని విద్యుత్‌ సౌధలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ను కలిసి ఈ పరిణామంపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై కొందరు మహిళా ఉద్యోగులు ఆయన వద్ద భోరున విలపించారు. గట్టిగా పోరాడాలని, మన ఉద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి తేవొద్దని ఉద్యోగ సంఘాల నేతలు విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులకు గట్టిగా విజ్ఞప్తి చేశారు.
 
తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి తొలగించిన మొత్తం 1,157 మంది ఆంధ్ర స్థానికత కలిగిన ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, వారిలో ఎవరైనా తమకు తాముగా ఆంధ్రకు రావాలనుకుంటేనే వారి ఐచ్ఛికాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించిందని.. కానీ ఈ ఉద్యోగులందరినీ ఆంధ్రకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులివ్వడం దారుణమని మరో నేత వ్యాఖ్యానించారు.