శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (11:43 IST)

''వెబినార్''లో పెళ్లి.. ఇంటికే నోరూరించే విందు భోజనం పార్శిల్... 20 వెరైటీలతో..!

కరోనా పుణ్యంతో లక్షలు ఖర్చు పెట్టి ఆడంబరంగా జరిగే వివాహాలు ప్రస్తుతం తక్కువ ఖర్చుతో ముగిసిపోతున్నాయి. పెళ్లి భోజనం కూడా రకరకాల వెరైటీలతో అతిథుల నోరూరే వంటకాలతో భోజనాలు వడ్డించే వారు. కానీ కోవిడ్‌తో అదంతా తగ్గిపోయింది. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ తక్కువ మందితో పెళ్లిలు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో.. ఓ వెరైటీ వెడ్డింగ్ కార్డు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
 
ఆ వెడ్డింగ్‌ కార్డు చూస్తే అంతా కాస్త షాక్ తిని.. తర్వాత కూల్ అవుతారు. ఎందుకంటే.. పెళ్లికి మీరు రానవసరం లేదు, కేవలం ఆన్‌లైన్‌లో మీరు జాయిన్ అయితే చాలు.. అని వుండటమే. అంతేగాకుండా ఇంటికే విందు భోజనం వచ్చేస్తుందని ఆ వెడ్డింగ్ కార్డులో వుంది. అంతేకాకుండా.. పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసే వివిధ రకాల వంటకాలను కూడా మెనూ రూపంలో ఆ వివాహ ఆహ్వాన పత్రికకు జత చేశారు.
 
శుభలేఖ ఇచ్చిన ప్రతి ఇంటికీ పెళ్లి రోజున విందు భోజనం పార్శిల్‌ కూడా పంపించారు. ఇంకా వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో వధూవరుల పేర్లు, ముహూర్తం తదితర వివరాలతో పాటు విందులో ఏమేమి వడ్డించేదీ వరుస నంబర్లు వేసిమరీ మెనూ రూపంలో రాసుకొచ్చారు. కూర, పప్పు, పులుసు, రసం, పచ్చళ్లు, అప్పడం, వడ, చిప్స్, పాయసం,  గారెలు, బూరెలు, స్వీట్లు అబ్బో ఒక్కటేంటి.. 19 రకాల వెరైటీలు ఉన్నాయి. వీటికి మరిన్ని అదనం.. మొత్తంగా అయితే 20కి పైగానే ఉన్నాయి. 
 
ఆ వంటకాలు నాలుగు బాక్సుల్లో సర్ది పంపారు. ఇక చెప్పేదేముంది.. మెనూ ముందే ఇచ్చేయడంతో సదరు బంధుమిత్ర సపరివారమంతా 'వెబినార్‌'లో జరుగుతున్న పెళ్లి కంటే... నోరూరించే భోజనం పార్శిల్‌ కోసమే తెగ ఎదురుచూశారట.