శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (22:49 IST)

లాక్డౌన్ 5.O తథ్యమా? కానీ ఆ నగరాలపైనే దృష్టి... యాక్షన్ ప్లాన్‌ ఇదేనా?

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ అమలవుతోంది. మార్చి 25వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ లాక్డౌన్ ఇప్పటికే నాలుగు దశలుగా సాగుతోంది. ఈ నాలుగో దశ లాక్డౌన్ ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. దీంతో ఐదో దశ లాక్డౌన్ కూడా ఉంటుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, లాక్డౌన్‌ను మరోమారు పొడగించనుందంటూ వస్తున్న వార్తలను, పుకార్లను నమ్మొద్దని కేంద్ర హోం శాఖ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ ఐదో దశ లాక్డౌన్ తప్పదనే వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగో విడత లాక్డౌన్ ముగిసే రోజు అంటే మే 31వ తేదీనాడు మరోసారి ప్రధాన మంత్రి దేశ ప్రజల ముందుకు రాబోతున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటున్న నరేంద్ర మోడీ, లాక్డౌన్ 5.0పై అదే రోజున ప్రకటన చేస్తారని అంతా భావిస్తున్నారు. 
 
అయితే, దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని సడలింపులు ఇస్తూనే.. 5వ విడత లాక్డౌన్‌ను ప్రధానమంత్రి ప్రకటిస్తారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం కేసులు 11 నగరాలలోనే నమోదవుతున్నాయి. అందుకే ఆ నగరాల్లో కరోనాను ఎలా నియంత్రించాలన్న వ్యూహంతో ప్రధానమంత్రి దేశ ప్రజల ముందుకు వస్తారని భావిస్తున్నారు. 
 
ప్రధాన సూచనల మేరకు లాక్‌డౌన్‌ 5.0 నిబంధనలను హోం శాఖ అధికారులు రూపొందిస్తున్నట్లు సమాచారం. జూన్‌ 1 నుంచి మొదలయ్యే లాక్‌డౌన్‌ 5.0లో ప్రదానంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణే, థానే, ఇండోర్‌, చెన్నై, అహ్మదాబాద్‌, జైపూర్‌, సూరత్‌, కోల్‌కతా నగరాలపైనే ఎక్కువ దృష్టి పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. 
 
దేశంలో ఇప్పటివరకు (మే 27 సాయంత్రం వరకు) నమోదైన 1.54 లక్షల కరోనా కేసుల్లో అహ్మదాబాద్‌, ఢిల్లీ, పుణే, కోల్‌కతా, ముంబై నగరాల్లోనే 60 శాతం కేసులు నమోదవడంతో ఈ నగరాల్లో వైరస్ కట్టడి మోడీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోబోతోంది. 
 
మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం కేసులు నమోదవుతున్న 30 మున్సిపల్‌ కార్పొరేషన్‌లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసి, ఆ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేయనుంది. 
 
అలాగే, కరోనా ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో వివిధ మతాలకు చెందిన ప్రార్థనా స్థలాల్లో భారీగా ప్రజలు గుమికూడటం నిషేధిస్తూ కోవిడ్‌-19 నిబంధనలను పాటించేలా వీటిని అనుమతించేందుకు కేంద్రం మొగ్గుచూపే అవకాశం ఉంది. 
 
ప్రార్థనా స్థలాల్లో ప్రతిఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేయనున్నారు. కాగా జూన్‌ ఒకటో తేదీ నుంచి అన్ని ప్రార్థనా స్థలాలను తెరిచేందుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ, ప్రధానికి లేఖ కూడా రాసింది. 
 
లాక్డౌన్‌ 4.0లో హెయిర్ కటింగ్ సెలూన్లకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా జిమ్‌లను, హెల్త్ క్లబ్‌లను తెరుచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. కంటైన్మెంట్‌ జోన్లు తప్పించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో జిమ్‌, హెల్త్ క్లబ్‌లను తెరుచుకునే ఛాన్స్ కనిపిస్తోంది. 
 
ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలతో వాటికి అనుమతించే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంమీద ఐదో దేశ లాక్డౌన్ మరో రెండు వారాల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.