గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : సోమవారం, 3 మే 2021 (21:46 IST)

కోవిడ్‌ 19 నియంత్రణ, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులు: సీఎం జగన్‌

రాష్ట్రంలో కోవిడ్‌19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా అన్ని అంశాలపై అన్ని కోణాల్లో చర్చించిన అనంతరం రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ, ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. ఒక వైపు ప్రజల దైనందిక అవసరాలు తీరడంతో పాటు, మరోవైపు వ్యాపారులు, అన్ని వర్గాలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
పాక్షిక కర్ఫ్యూ:
బుధవారం (5వ తేదీ) నుంచే పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ, ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్ని షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తారు. ఆ తర్వాత కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం వరకు అన్ని షాపులు తెరిచిన సమయంలో 144 సెక్షన్‌ అమలు చేస్తారు. 5గురికి మించి ఒకే చోట చేరకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.
 
పరీక్షలు–వైద్య సేవలు:
కోవిడ్‌ పాజిటివ్‌గా గుర్తించిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని, ఇది పక్కాగా జరగాలని సమీక్షలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఎంప్యానెల్‌లో (జాబితా)లో ఉన్న ఆస్పత్రుల్లో కూడా వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు.
 
ఆక్సీజన్‌ సరఫరా:
అన్ని ఆస్పత్రులలో రోగులకు సరిపడా ఆక్సీజన్‌ను అందుబాటులో ఉంచే విధంగా దిగుమతి చేసుకోవాలని, అదే విధంగా దిగుమతి చేసుకున్న ఆక్సీజన్‌ను నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆ మేరకు ట్యాంకర్లు సేకరించాలని, ఏ ఆస్పత్రిలో కూడా ఆక్సీజన్‌ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. కాగా, అంతకు ముందు రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు, పరీక్షలు, వైద్య సేవలకు సంబంధించిన వివరాలను సమావేశంలో అధికారులు వివరించారు.
 
ఆస్పత్రులు–బెడ్లు:
రాష్ట్రంలో నెలకు సగటున 3,10,915 పరీక్షల చొప్పున ఇప్పటి వరకు మొత్తం 1,66,0,2873 పరీక్షలు నిర్వహించామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 558 కోవిడ్‌ ఆస్పత్రులు ఉండగా, వాటిలో మొత్తం 44,599 బెడ్లు ఉన్నాయని, ఆ ఆస్పత్రులలో 37,760 మంది కోవిడ్‌ చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు. 3,597 మంది రోగులు వెంటిలేటర్లపై చికిత్స పొందుతుండగా, 1,01,204 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
 
కోవిడ్‌ కేర్‌ సెంటర్లు:
రాష్ట్ర వ్యాప్తంగా 81 కోవిడ్‌ కేర్‌ సెంటర్ల (సీసీసీ)లో 41,780 బెడ్లు ఉండగా, వాటిలో నిన్నటి (మే 2వ తేదీ) వరకు 9937 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఇంకా 31,843 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్న వారు, 104 కాల్‌ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని తెలిపారు.
 
ఆక్సీజన్‌:
జిల్లాలలో ఆక్సీజన్‌ వసతి ఉన్న ఆస్పత్రులు 146 ఉండగా, వాటిలో ఆక్సీజన్‌ పైప్‌లైన్‌ ఉన్న బెడ్లు 26,446 అని సమీక్షా సమావేశంలో అధికారులు వెల్లడించారు. ఇప్పుడు రోజుకు సగటున 420 నుంచి 500 మెట్రిక్‌ టన్నుల వినియోగిస్తుండగా, ఈనెల రెండో వారం చివరి నాటికి ఆ వినియోగం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి 480 మెట్రిక్‌ టన్నుల ఆక్సీజన్‌ కేటాయించగా, రవాణాకు అవసరమైన ట్యాంకర్లు లేక అందులో 448 మెట్రిక్‌ టన్నులు మాత్రమే మనం తీసుకోగలుగుతున్నామని (ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కలిపి) చెప్పారు.

ఆక్సీజన్‌ రవాణాతో పాటు, స్టోరేజీకి కూడా ట్యాంకర్ల అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో ఆక్సీజన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోటా పెంచాలని కేంద్రాన్ని కోరామని అధికారులు వెల్లడించారు. పెరంబుదూరు (తమిళనాడు), బళ్లారి (కర్ణాటక) నుంచి చెరి 200 మెట్రిక్‌ టన్నుల ఆక్సీజన్‌ రవాణా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అదే విధంగా రవాణా కోసం వాహనాలు (ట్యాంకర్లు) ఇవ్వాలని కూడా కోరుతున్నామని చెప్పారు.
 
ఔషధాల అందుబాటు:
రాష్ట్రంలో కొత్తగా మైలాన్‌ ల్యాబ్‌ నుంచి 8 లక్షల రెడ్‌మిస్‌విర్‌ ఇంజెక్షన్ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చామని అధికారులు తెలిపారు. ఇంకా ఎన్‌–95 మాస్కులు 5,67,844, పీపీఈలు 7,67,732, సర్జికల్‌ మాస్కులు 35,46,100, హోం ఐసొలేషన్‌ కిట్లు 2,04,960 ఇప్పుడు నిల్వ ఉన్నాయని వారు చెప్పారు.
 
వాక్సినేషన్‌:
రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో ఇప్పటి వరకు 52 లక్షల మందికి తొలి వాక్సిన్‌ ఇవ్వడం జరిగిందన్న అధికారులు, మొత్తం 1,33,07,889 మందికి వాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందని వివరించారు.
 
డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ స్పెషల్‌ ఆఫీసర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌చంద్ర, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌) ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌) ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్‌తో పాటు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.