గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (14:33 IST)

పాకిస్థాన్ చెరలో తెలుగోడు... మతిస్థిమితం లేదా? టెక్కీ తండ్రీ ఏమంటున్నారు!

అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించారనే ఆరోపణలతో ఇద్దరు భారతీయులను పాకిస్థాన్‌ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో తెలుగు వ్యక్తి ప్రశాంత్‌ కూడా ఉన్నాడు. ప్రశాంత్‌ను అరెస్టు చేయడంపై ఆయన తండ్రి బాబూరావు మీడియాతో మాట్లాడారు. తమ కుమారుడు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి కాదన్నారు. 
 
ఢిల్లీ వెళ్లి రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తమ కుమారుడిని క్షేమంగా అప్పగించాలని కోరతామన్నారు. విశాఖపట్నానికి చెందిన బాబూరావు కుటుంబం గత ఐదేళ్లుగా కూకట్‌పల్లిలో నివాసం ఉంటోంది. ప్రశాంత్‌ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు అతడి గురించి ఎలాంటి సమాచారం లేదు. దీనిపై ఏప్రిల్‌ 29, 2017న బాబూరావు మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. 
 
హైదరాబాద్ నుంచి వెళ్లిపోయిన తర్వాత బెంగళూరులోని ఓ కంపెనీలో పని చేస్తున్న సమయంలో సహోద్యోగితో ప్రశాంత్‌ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అది విఫలం కావడంతో మానసిక ఒత్తిడికి గురై.. ఈ క్రమంలోనే రాజస్థాన్‌ వెళ్లి పొరపాటున పాక్‌లోకి అడుగుపెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. మరోవైపు 2017 తర్వాత ప్రశాంత్‌ ఎక్కడెక్కడ ఉన్నాడన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
పాక్‌ పోలీసులు అరెస్టు చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన వారిలాల్‌తో ఇతడికి ఏవిధంగా పరిచయం ఏర్పడిందన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ పోలీసుల సహాయంతో మరింత సమాచారం సేకరించి పూర్తి వివరాలను కేంద్ర హోం శాఖకు పంపనున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.
 ఈ నెల 14న బహావుల్‌పూర్‌లో ప్రశాంత్‌, వారీలాల్‌ను నిర్బంధంలోకి తీసుకున్నట్లు పాక్‌ పోలీసులు వెల్లడించారు. 
 
పాస్‌పోర్టు, వీసా లేకుండా చోలిస్థాన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని వారు తెలిపారు. సర్దార్‌ యహాజమన్‌ మండి పోలీసు స్టేషన్‌ వద్ద అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌ సరిహద్దులకు చేరువలో చోలిస్థాన్‌ ఉంది. వీరిద్దరిపై పాకిస్థాన్‌ చట్టంలోని 334-4 కింద అభియోగాలు నమోదు చేశారు. ఈ వ్యవహారం భారత్‌, పాక్‌ల మధ్య దౌత్యపరంగా మరో వివాదానికి దారితీసే అవకాశం ఉంది. 
 
రాజస్థాన్‌లో థార్‌ ఎడారిలో వీచే ప్రచండ గాలుల వల్ల ఇసుక తిన్నెలు ఒక చోటు నుంచి మరోచోటుకు బదిలీ అవుతుంటాయి. ఫలితంగా భారత్‌-పాక్‌ సరిహద్దు వెంబడి ఉన్న కంచె కొన్నిసార్లు కనిపించదని భారత అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్న పొరుగు దేశాలకు చెందిన కొందరు పొరపాటున సరిహద్దును దాటి పాక్‌లోకి అడుగుపెట్టిన సందర్భాలు గతంలో చోటుచేసుకున్నాయని వివరించాయి. తాజా కేసులోనూ ఇదే జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.