శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (08:59 IST)

నా పేరు పవన్ కాదు.. నా విశ్వరూపం చూపిస్తా...

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు.. ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాను మద్దతివ్వకపోతే చంద్రబాబు రిటైరై ఉండేవారన్నారు. తన మద్దతుతోనే ఆయన సీఎం అయ్యారని మరోమారు గుర్తు చేశారు. 
 
ప్రజాపోరాటయాత్రలో భాగంగా ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగసభలో మాట్లాడారు. అధికారం కోసం పార్టీలు మారే నాయకులు వద్దని, సమర్థ యువనాయకత్వం రావాలని ఆకాంక్షించారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని లూటీ చేయడం, అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనీ, దీన్ని అడ్డుకునేందుకే చంద్రబాబుకు నాడు మద్దతిచ్చానని చెప్పారు.
 
ముఖ్యంగా, ప్రత్తిపాడు మండలం వంతాడలో రూ.3 వేల కోట్ల మైనింగ్‌ దోపిడీ జరిగింది. నేను వంతాడ లేటరైట్‌ గనుల వద్దకు వెళ్లకుండా గ్రావెల్‌పోసి అడ్డంపెట్టారు. అరేయ్‌.. మీకే (మైనింగ్‌ యాజమాన్యం) చెబుతున్నా. ఇంత ప్రజాబలం ఉన్న జనసేన వస్తుంటే అడ్డంపెడతారా.. తాట తీసి కూర్చోబెట్టకపోతే నా పేరు పవన్‌ కల్యాణే కాదు. మా మీదా మీ బోడి ప్రతాపం. వంతాడ ఆండ్రూ కంపెనీ ఆటలు సాగనివ్వం. జనసేన అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటాం అంటూ హెచ్చరించారు. 
 
అంతేకాకుండా, నేను ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు సీఎం అండగా లేరు. నన్ను కూరలో కరవేపాకులా పడేశారు. నా సహనం, మర్యాద తగ్గిస్తే నా విశ్వరూపం చూపిస్తా. మా అన్నను కాదని టీడీపీకి సపోర్టు చేస్తే.. ఈరోజు చంద్రబాబు వెళ్లి రాహుల్‌ మోకాళ్లకు దండం పెట్టి.. పాదాలకు నమస్కారం పెట్టినట్లుగా ఆయనకు లొంగిపోయి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడితే నాకు బాధ కలుగదా..? ద్రోహం చేసిన వాళ్లకు 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఎలా విధిస్తామో.. అలా కాంగ్రెస్ పార్టీకి కనీసం 14 ఏళ్లు రాష్ట్రంలో స్థానం లేదు. ఎవరైనా దారిన పోయే తద్దినాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటారా.. ఒక్క చంద్రబాబు తప్ప అంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు.