గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (16:12 IST)

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రద్దు... భారతీయ సినిమాలు బహిష్కరణ.. పాక్ దూకుడు

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లుకు నిరసనగా పాకిస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. భారత్ వైఖరికి ప్రతీకార చర్యలకు దిగొద్దని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినా పాకిస్థాన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను నిలిపివేసింది. అలాగే, భారతీయ సినిమాలను కూడా బహిష్కరించింది. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి వర్తింపజేస్తూ వచ్చిన అధికరణ 370ను కేంద్రం ఇటీవల రద్దు చేసింది. అంతేకాకుండా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ చర్యను పాకిస్థాన్ తీవ్రంగా తప్పుపడుతోంది. ఇది భారత్ - పాక్ ద్వైపాక్షిక ఒప్పందాలకు వ్యతిరేకమంటూ ఘోషిస్తోంది. 
 
దీనికి నిరసనగా భారత్‌తో వాణిజ్యాన్ని బంద్ చేసింది. అలాగే, ఢిల్లీలో నియమించాల్సిన పాకిస్థాన్ హైకమిషనర్ నియామకాన్ని కూడా ఉపసంహరించుకుంది. అలాగే, ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్‌ను స్వదేశానికి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. అలాగే, కనిష్ట స్థాయిలోనే దౌత్య సంబంధాలు కొనసాగించాలని తీర్మానించింది. 
 
ఈ నేపథ్యంలో గురువారం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను రద్దు చేసి, తమ దేశంలో ఏ ఒక్క భారతీయ సినిమా విడుదలకాకుండా నిషేధం విధించింది. దీంతో భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు ప్రశ్నార్థకంగా మారాయి. 
 
ఇదిలావుంటే పాకిస్థాన్ తన దూకుడును తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచించారు కూడా. అంత దూకుడు తగదంటూ మొట్టిక్కాయలు వేసింది. పైగా, సంయమనం పాటించాలంటూ సలహా ఇచ్చింది. నిజానికి జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడంపై భారత్‌ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్న అమెరికా తొలుత ఆగ్రహించింది. 
 
ఆ తర్వాత కొద్దిసేపటికే జమ్మూ కాశ్మీర్‌ పరిణామాలపై తన స్పందనను తెలియజేసింది. భారత్‌తో వాణిజ్య సంబంధాలకు స్వస్తి పలకడంతో పాటు దౌత్యపరమైన చర్యలతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం దూకుడు పెంచడంతో సంయమనం పాటించాలని అగ్రరాజ్యం సూచించింది. 
 
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై ప్రతీకార చర్యలకు పాల్పడదవద్దనీ, చొరబాట్లను ప్రోత్సహించరాదంటూ హితవు పలికింది. ముఖ్యంగా, తమ భూభాగంలోని ఉగ్రవాదులు, ఉగ్ర శిబిరాలపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ సుతిమెత్తని హెచ్చరికలు చేసింది.