శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (12:15 IST)

అంత దూకుడు పనికిరాదు బ్రదర్.. పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని పాకిస్థాన్ సీరియస్‌గా తీసుకుంది. ఫలితంగా భారత్‌తో వాణిజ్య సంబంధాలను తెంచుకుంది. అలాగే, ఢిల్లీలోని పాక్ హైకమిషనర్‌ నియామకాన్ని ఉపసంహరించుకుంది. అలాగే, ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషనర్‌ను బహిష్కరించింది. ఈ దుందుడుకు చర్యలపై అమెరికా ఆగ్రహం వ్యక్తంచేసింది. 
 
అంత దూకుడు తగదంటూ మొట్టిక్కాయలు వేసింది. పైగా, సంయమనం పాటించాలంటూ సలహా ఇచ్చింది. నిజానికి జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడంపై భారత్‌ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్న అమెరికా తొలుత ఆగ్రహించింది. 
 
ఆ తర్వాత కొద్దిసేపటికే జమ్మూ కాశ్మీర్‌ పరిణామాలపై తన స్పందనను తెలియజేసింది. భారత్‌తో వాణిజ్య సంబంధాలకు స్వస్తి పలకడంతో పాటు దౌత్యపరమైన చర్యలతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం దూకుడు పెంచడంతో సంయమనం పాటించాలని అగ్రరాజ్యం సూచించింది. 
 
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై ప్రతీకార చర్యలకు పాల్పడదవద్దనీ, చొరబాట్లను ప్రోత్సహించరాదంటూ హితవు పలికింది. ముఖ్యంగా, తమ భూభాగంలోని ఉగ్రవాదులు, ఉగ్ర శిబిరాలపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ సుతిమెత్తని హెచ్చరికలు చేసింది.