శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2019 (17:12 IST)

పాకిస్తాన్‌ను కలిపి అఖండ భారత్ ఏర్పాటు చేయాలి : ఇస్లామాబాద్‌లో ఫ్లెక్సీలు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని ప్రధాని మోడీ సర్కారు రద్దు చేసింది. దీంతో పాకిస్థాన్ అంతటా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అదేసమయంలో ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా భారత్ అనుకూల ఫ్లెక్లీలు కూడా కనిపించాయి. పాకిస్తాన్‌తో కలుపుకుని అఖండ భారత్‌ను ఏర్పాటు చేయాలన్నది ఆ ఫ్లెక్సీలోని ప్రధాన సారాంశంగా ఉంది. దీంతో అప్రమత్తమైన పాక్ పోలీసులు ఆ ఫ్లెక్సీలను చింపివేశారు. 
 
జమ్మూకాశ్మీర్ విషయంలో భారత చర్యలను పాకిస్థాన్‌లోని కొంతమంది గట్టిగా సమర్థిస్తున్నారు. వీటిని రుజువు చేసేలా భారత్‌కు అనుకూలంగా ఫ్లెక్సీలు దర్శనమివ్వడం సంచలనం రేకెత్తించింది. ఇస్లామాబాద్‌లోని ప్రెస్ క్లబ్, సెక్టార్ ఎఫ్-6, అబ్ పారా చౌక్ ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు కనిపించాయి. 'మహాభారత్ దిశగా ముందడుగు' అని బ్యానర్లో పేర్కొన్నారు. 
 
అంతేకాదు, అఖండ భారత్ లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి చేయాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను బ్యానర్‌పై ప్రింట్ చేశారు. ఈ బ్యానర్లను స్థానికులు చాలా సేపు ఆసక్తికరంగా చూశారు. ఆ తర్వాత కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... వారు వచ్చి ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌లోని ప్రముఖ పత్రిక డాన్ ప్రచురించింది. మరోవైపు, దీనికి సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.