గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 2 జనవరి 2020 (21:10 IST)

'మా' గొడవ, ఎవరు కరెక్ట్? చిరంజీవి లేదా రాజశేఖర్?

కొన్ని మాటలు మంచికి బాట వేస్తాయి. మరికొన్ని మాటలు కొట్లాటలు సృష్టిస్తాయి. ఇంకొన్ని మాటలు యుద్ధాలకే దారి తీస్తాయి. ఐతే శుభమా అని 2020 జనవరి 1న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన సంవత్సరం సందర్భంగా కొత్త డైరీని విడుదల చేసే క్రమంలో నటుడు రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు అతడి పదవికే ఎసరు పెట్టింది. ఐతే సభలో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవితో పాటు మరికొందరు నటీనటులు తీవ్రంగా ఖండించారు. 
 
'మా' సభ్యులు మంచిని బహిరంగంగా చెప్పుకోవాలనీ, చెడు వుంటే చెవిలో చెప్పుకోవాలని చిరంజీవి సూచన చేశారు. ఐతే ఈ సూచనపై రాజశేఖర్ విభేదించారు. బహిరంగంగా అందరి ముందూ మాట్లాడటంతో చిరంజీవితో పాటు మోహన్ బాబు కూడా అసహనానికి గురయ్యారు.

రాజశేఖర్ మాట్లాడిన తర్వాత చిరు మళ్లీ సర్దిచెప్పబోతున్న సమయంలో కూడా రాజశేఖర్ మళ్లీ కల్పించుకోవడంతో... ఇంతమంది పెద్దలు ఇక్కడ వుండగానే రాజశేఖర్ అలా మాట్లాడటం చూస్తుంటే ఇదంతా ముందస్తు ప్లాన్ అనీ, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ మెగాస్టార్ చిరంజీవి డిమాండ్ చేశారు. 
 
వెంటనే కృష్ణంరాజు మైకు అందుకుని కో-ఆర్డినేషన్ కమిటీ వేస్తామనీ, ఏవయినా సమస్యలుంటే సభ్యులు అక్కడే మాట్లాడాలనీ, బయట మాట్లాడితే చర్యలు తప్పవని చెప్పారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే 'మా' ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో చిరంజీవి చేసింది కరెక్టా లేదంటే రాజశేఖర్ చేసింది కరెక్టా అనే చర్చ నడుస్తోంది. మరి మీరు ఏమని అంటారు?