1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: మంగళవారం, 1 జూన్ 2021 (16:52 IST)

మాస్కు లేని మంత్రిగారు: తలసాని గారూ మీకిది తగునా?

ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం సనత్ నగర్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాన్ని ఆయన ghmc కమిషనర్ లోకేష్ కుమారం జోనల్ కమిషనర్ ప్రావిణ్య, కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి లతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా వ్యాక్సిన పంపిణీ, ఏర్పాట్లను పరిశీలించారు. వ్యాక్సిన్ కోసం వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్ట్రీట్ వెండర్స్, మాంసం దుఖాన దారులు, కూరగాయల విక్రయదారులు తదితర చిన్న వ్యాపారుల కోసం ghmc పరిధిలోని 30 సర్కిల్ లలో వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి ద్వారా ఇప్పటి వరకు 92 వేల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు చెప్పారు.

ఈ నెల 3 వ తేదీ నుండి ఆటో డ్రైవర్ లకు వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో ప్రభుత్వం కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటుందని, ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షించి అవసరమైన ఆదేశాలను జారీ చేస్తున్నట్లు వివరించారు. కరోనా వ్యాప్తిని అరికట్టే  చర్యలలో భాగంగానే ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తుందని, ఈ లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు.

ప్రజలకు  మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి అనేక చర్యలను తీసుకుంటున్నారని చెప్పారు. అమీర్ పేట లోని 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణ లో వైద్యులు, నర్స్‌లు, ఆశ వర్కర్ల కృషి ఎనలేనిదని ప్రశంసించారు. అంతా బాాగానే వుంది కానీ మంత్రిగారు మాస్కు లేకుండా తిరగడం కాస్త చర్చనీయాంశంగా మారింది. కరోనా ఉధృతి నేపధ్యంలో మాస్కు వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని ఒకవైపు చెపుతూనే వారే పాటించకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.