1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (10:42 IST)

లండన్ స్టోక్‌పార్క్‌లో ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ మకాం? రిలయన్స్ వివరణ ఏంటి?

దేశ కార్పొరేట్ దిగ్గజం ముఖేశ్ అంబానీ లండన్‌కెళ్ళి స్థిరపడాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అక్కడ రాజప్రసాదం వంటి భవనాన్ని కూడా ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.
 
దేశవ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ముకేశ్‌ లక్షల కోట్ల రూపాయలకు అధిపతిగా మారారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్‌ 11వ స్థానంలో నిలిచారు. ఈ కారణంగానే వీరి జీవన విధానంతో పాటు వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రతి చిన్న వార్త దేశం దృష్టిని ఆకర్షిస్తుంది. 
 
ఈ క్రమంలోనే తాజాగా ముకేశ్‌ కుటుంబానికి సంబంధించ ఓ వార్త వైరల్‌గా మారింది. ముకేశ్‌ అంబానీ కుటుంబం కొన్ని రోజుల్లో పూర్తిగా లండన్‌ షిప్ట్‌ కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ప్రకారం ముకేశ్‌ అంబానీ లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారని, త్వరలోనే ఆ కుటంబం లండన్‌లో సెటిల్‌ కానున్నారని కథనం వచ్చింది. 
 
ఇక ఇంటి నిర్మాణం గురించి కూడా రకరాల వార్తలు వచ్చాయి. కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా అటు ముకేశ్‌ అంబానీ నుంచి గానీ వారి సంస్థల నుంచి ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. దీంతో ఈ వార్తలు నిజమనే వాదనలకు కూడా బలం చేకూరుంది.
 
ఈ నేపథ్యంలో ఈ వార్తలకు ఎంతకీ ఫుల్‌స్టాప్‌ పడకపోవడంతో రిలయన్స్‌ ఎట్టకేలకు స్పందించింది. ముకేశ్‌ అంబానీ లండన్‌కు వెళ్లనున్నారనే వార్తలపై మీడియాకు అధికారిక స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ‘అంబానీ కుటుంబం లండన్‌కు షిప్ట్‌ కానున్నట్లు గతకొన్ని రోజుల క్రితం ఓ వార్తాపత్రికలో నిరాధారనమైన వార్త ప్రచురితమైంది.
 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఈ వార్తపై స్పష్టతనిచ్చేందుకు ఈ మీడియా స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది. అంబానీ కుటుంబం లండన్‌కే కాదు ప్రపంచంలో మరే చోటుకు వెళ్లడం లేదు. ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీ లండన్‌లోని స్టోక్‌ పార్క్ ఎస్టేట్‌ను ఇటీవల కొనుగోలు చేసిన వార్త నిజమే. 
 
అయితే ఈ ఎస్టేట్‌ను ప్రీమియర్‌ గోల్ఫింగ్‌ క్లబ్‌తో పాటు క్రీడా రిసార్ట్‌గా మార్చాలనే ఉద్దేశంతోనే కొనుగోలు చేశామని స్పష్టతనిచ్చింది. లండన్‌లో ఈ ఎస్టేట్‌ కొనుగోలుతో భారత్‌కు మాత్రమే ప్రసిద్ధమైన ఆధిత్య రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయాలనే లక్ష్యంతోనే ఎస్టేట్‌ను కొనుగోలు చేసినట్లు రిలయన్స్‌ గ్రూప్‌ వివరణ ఇచ్చింది.