1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (10:26 IST)

దేశంలో మరింత దిగువకు కరోనా పాజిట్ కేసులు

దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 10,929 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది శుక్రవారం నాటి కేసుల కంటే 14.14 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కొత్తగా 10,929 మంది కరోనా బారినపడటంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,683కు చేరింది. ఇందులో 3,37,37,468 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,46,950 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మరో 4,60,265 మంది బాధితులు కరోనాతో కన్నుమూశారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతం ఉన్నదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
 
ఇక శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 12,509 మంది కరోనా నుంచి కోలుకోగా, 392 మంది మృతిచెందారని వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో ఒక్క కేరళలోనే 6580 కేసులు, 314 మరణాలు ఉన్నాయని ప్రకటించింది.
 
దేశవ్యాప్తంగా శుక్రవారం 8,10,783 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) తెలిపింది. నవంబర్‌ 5 వరకు 61,39,65,751 నమూనాలకు పరీక్షలు చేశామని వెల్లడించింది.