1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 30 మే 2018 (16:34 IST)

భర్తలకు రక్షణేది.. ఓ మహిళ ఆవేదన.. మగాళ్ళకూ ఓ కమిషన్ ఉండాల్సిందే...

దేశంలో ఎక్కడ చూసినా పొద్దస్తమానం మహిళల రక్షణ గురించే చర్చించుకుంటుంటారు. కానీ, మగాళ్ళ రక్షణ గురించి ఏ ఒక్క పురుషుడు గానీ మహిళ గానీ నోరెత్తదు. కానీ, ఓ మహిళ మాత్రం పురుషులకు కూడా రక్షణ కల్పించాలని డిమాం

దేశంలో ఎక్కడ చూసినా పొద్దస్తమానం మహిళల రక్షణ గురించే చర్చించుకుంటుంటారు. కానీ, మగాళ్ళ రక్షణ గురించి ఏ ఒక్క పురుషుడు గానీ మహిళ గానీ నోరెత్తదు. కానీ, ఓ మహిళ మాత్రం పురుషులకు కూడా రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ మహిళ ఎవరో కాదు.. నన్నపనేని రాజకుమారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్.
 
ఇటీవలికాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భార్యల చేతుల్లో భర్తలు హతమవుతున్న ఘటనలు ఎక్కువైపోయాయి. అలాగే, వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ పతులపై భార్యలు దాడులు చేయిస్తున్నారు. దీంతో పురుషుల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. దీనిపై నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. మగాళ్ల రక్షణకు ఓ కమిషన్ ఉండాలని గట్టిగా కోరుతున్నారు. 
 
ముఖ్యంగా, గత నెల రోజుల వ్యవధిలోనే ఉత్తరాంధ్రలో రెండు ఘోరాలు జరిగాయి. పెళ్లయిన వారం రోజుల్లోనే తన భర్తను సుపారీ ఇచ్చి చంపించింది ఓ భార్య. మరో కేసులో పెళ్లయిన 20 రోజుల్లోనే.. బైక్‌పై వెళుతూనే భర్తను వెనుక నుంచి మెడను తెగనరికి పారిపోయింది అతని భార్య. 
 
అదేవిధంగా వివాహేతర సంబంధాలతో భర్తలపై దాడులు, హత్యాయత్నాలు చేయించే ఘటనలు కూడా ఎక్కువైపోతున్నాయి. మహిళల్లో ఇలాంటి విపరీతమైన నేర ప్రవృత్తి పెరగటానికి టీవీల్లో వచ్చే సీరియల్స్ కారణమని నన్నపనేని రాజకుమారి అంటున్నారు. 
 
సీరియల్స్‌కు సెన్సార్ ఉండాలని.. నేర ఇతివృత్తం, కుట్ర, కుతంత్రాలు ఉండే సీన్స్‌ను తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళల్లో ఇలాంటి విపరీత ధోరణిలకు కారణాలను గుర్తించి.. వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. 
 
అంతేకాకుండా భార్యలో చేతిలో మోసపోతున్న, చిత్రహింసలకు గురవుతున్న మగాళ్లకు.. ఓ కమిషన్ ఉండాలన్నారు. మహిళా కమిషన్ ఉన్నట్లే.. పురుషుల కమిషన్ ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో భార్యల చేతిలో దాడికి గురైన వారిని పరామర్శించి.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.