శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2020 (09:37 IST)

నిర్భయ కేసు : ఉరితీతకు ముందు... ఉరితీసిన తర్వాత... ఏం చేశారు?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ వైద్య విద్యార్థిని నిర్భయ అత్యాచార కేసులోని ముద్దాయిలకు ఉరిశిక్షలను అమలు చేశారు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఒకేసారి ఉరితీశారు. 
 
ముద్దాయిలైన పవన్ కుమార్, అక్షయ్ కుమార్ ఠాకూర్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలను ఉరితీసేందుకు ముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితి బాగుందని తీహార్‌ జైలు వైద్యాధికారులు నిర్ధారించారు. 
 
ఆ తర్వాత ఉరిశిక్ష అమలు నేపథ్యంలో జైలు లాక్‌డౌన్‌ చేశారు. జైలు బయట జనం గుమికూడారు. తీహార్‌ జైలు బయట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
ఉరితీసేందుకు ముందు జైలు సూపరింటెండెంట్‌, వైద్యాధికారి, జిల్లా కలెక్టర్‌ దోషులు ఉన్న సెల్‌లోకి వెళ్లి దోషులను కలిశారు. చివరి కోరిక, ఇతర విషయాలన్ని పత్రాల్లో రాయించుకుని దోషుల సంతకాలు తీసుకున్నారు. జైలు నెంబర్ మూడులో ఉన్న ఉరికంబం వద్దకు దోషులను తరలించారు. 
 
ఉరికంబం ఎక్కే ముందు దోషి ముఖాన్ని నల్లటి కాటన్ వస్త్రంతో కప్పారు. ఉరి నిబంధన ప్రకారం దోషి ఉరికంబాన్ని చూడకూడదని ఈ విధంగా చేస్తారు. వార్డెన్లు దోషులను పట్టుకున్నారు. సూపరింటెండెంట్ సంజ్ఞా చేయగానే వార్డెన్లు దోషులను విడిచిపెట్టారు. 
 
ఆ తర్వాత తలారి బోల్టును లాగాడు. దీంతో ఉరిశిక్ష అమలు పూర్తయింది. దోషుల మృతదేహాలను కిందకు దించారు. దోషులు మృతి చెందినట్లు డాక్టర్లు దృవీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. 
 
నాలుగు శవాలకు ఉదయం 8 గంటలకు పోస్టుమార్టం పూర్తి చేస్తారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తారు. ఖననం చేయడానికి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. 
 
ఈ కేసులోని మరో దోషి రామ్ సింగ్  2013 మార్చి 11వ తేదీన తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. మరో మైనర్ నిందితుడికి 2013 ఆగస్టు 31న మైనర్ దోషికి మూడేళ్ల రిఫార్మ్ హోం శిక్ష విధించారు. 2015 డిసెంబర్ 20వ తేదీన రిఫార్మ్ హోం నుంచి మైనర్ విడుదలయ్యాడు.