శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (10:21 IST)

కరోనాపై విజయానికి మరో మెట్టు... ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ పరిశోధనలో ముందడుగు

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అనేక ప్రపంచ దేశాలు తీవ్రస్థాయిలో పరిశోధనలు చేస్తున్నాయి. ముఖ్యంగా, కరోనా వ్యాక్సిన్ కనుగొనే పనిలో పలు దేశాల శాస్త్రవేత్తలు నిమగ్నమైవున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, స్వీడన్ సంస్థ ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్, తొలి రెండుదశలనూ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇది ప్రపంచ మానవాళికి ఆశాదీపంలా కనిపిస్తోంది. 
 
ఏప్రిల్ నెలలో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం కాగా, రెండు దశల ఫలితాలు రెండు వారాల క్రితం విడుదల అయ్యాయి. ఇప్పుడు మూడో దశ ట్రయల్స్ సాగుతుండగా, అవి కూడా విజయవంతమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కాగా, మూడో దశలో పెద్దఎత్తున వలంటీర్లను ఎంచుకున్న ఆక్స్‌ఫర్డ్ వారికి వ్యాక్సిన్ ఇచ్చింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం, వీరి శరీరంలో కరోనాను ఎదుర్కొనే నిరోధక శక్తి గణనీయంగా పెరిగింది. ఇక మూడోదశ డేటాను నిశితంగా పరిశీలించిన ఆస్ట్రాజెనికా, వ్యాక్సిన్ తయారీని ముమ్మరం చేసింది. ప్రపంచానికి తాము హామీ ఇచ్చినట్టుగా బిలియన్ డోస్‌లను అందించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. 
 
2021 ఆరంభంలోనే ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి అందించాలని కృషి చేస్తోంది. కాగా, వ్యాక్సిన్ సిద్ధమవుతోందన్న విషయమై ఎటువంటి సందేహాలు లేకపోగా, ఈ వ్యాక్సిన్ శరీరంలో ఎంతకాలంపాటు యాంటీ బాడీలను పెంచుతుంది? అవి కరోనా సోకకుండా ఎంతకాలం రక్షణను కల్పిస్తాయన్న విషయమై వస్తున్న ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు.