శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: గురువారం, 4 ఫిబ్రవరి 2021 (19:45 IST)

జయలలిత సమాధి వద్దకు శశికళ? వణుకుతున్న పళని-పన్నీర్, ఎందుకు?

బెంగుళూరు పరప్పణ జైలు నుంచి శశికళ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సిటీలోని ఒక రిసార్ట్స్‌లో ఆమె రెస్ట్ తీసుకుంటోంది. అది కూడా హోం క్వారంటైన్లో ఉంది శశికళ. ఈనెల 7వ తేదీ చెన్నైకు రావాలని శశికళ నిర్ణయించుకుంది. సుమారు నాలుగు సంవత్సరాల తరువాత చెన్నైకు వస్తున్న శశికళకు భారీ స్వాగతం పలికేందుకు ఆమె అభిమానులు సిద్థమవుతున్నారు.
 
ఇదంతా గమనిస్తున్న అన్నాడిఎంకే పార్టీ నేతల్లో భయం పట్టుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి పళణిస్వామి, పన్నీరుసెల్వంలలో భయం మరింత పట్టుకుందట. అందుకు ముఖ్య కారణం పళణిస్వామిని ముఖ్యమంత్రి చేసింది శశికళనే. అయితే మొదట్లో విధేయుడిగా ఉన్న పళణిస్వామి ఆ తరువాత పూర్తిగా పన్నీరుసెల్వంతో కలిసిపోయి శశికళను దూరం పెట్టేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆమెను పంపించేశారు.
 
ఇదే శశికళకు ఏమాత్రం ఇష్టం లేదు. జైలు శిక్ష అనుభవించిన తరువాత అన్నాడిఎంకే పార్టీని మళ్ళీ తానే వెళ్ళి పార్టీలో కార్యకలాపాలను చక్కదిద్దాలన్న నిర్ణయంలో ఉన్నారట శశికళ. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ శశికళ జయలలిత సమాధి వద్దకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారట.
 
దీంతో అన్నాడిఎంకే నేతలు ముందుగానే ఆమెకు చెక్ పెట్టడం ప్రారంభించారు. అస్సలు జయలలిత సమాధుల వద్దకు 15 రోజుల పాటు సందర్సకుల అనుమతి లేకుండా చేసేశారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి వెళితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు కూడా జారీ చేసేశారు. 
 
ఇదంతా చిన్నమ్మకు చెక్ పెట్టేందుకేనని శశికళ వర్గీయులు చెప్పడంతో పాటు వారు ఎన్నిచేసినా ఖచ్చితంగా శశికళ జయలలిత సమాధి వద్దకు వెళ్ళి తీరుతుందని చెబుతున్నారు. దీంతో తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.