గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (17:54 IST)

మీరు ఫినిష్ అయిపోతారు : బీజేపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

తన వాహనశ్రేణిని అడ్డుకున్న బీజేపీ నేతలు, కార్యకర్తలకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరిక చేశారు. 'నన్ను డౌన్.. డౌన్ అనడం కాదయ్యా.. మీరందరినీ జనాలు తరిమి కొడతారు. లేనిపోని సమస్యలు పెట్టుకోవద్దు. మీరు ఫినిష్ అయిపోతారు' అంటూ వార్నింగ్ ఇచ్చారు. 
 
టీడీపీ సర్కారు చేపడుతున్న అభివృద్థి పథకాల్లో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుంటుందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు శనివారం చంద్రబాబు కాన్వాయ్‌ను అడుకుని నిరసన తెలిపారు. కాకినాడ జేఎన్టీయూలో జరిగిన 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు నేతలు, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 
 
తొలుత ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు యత్నించారు. అయితే ఆందోళనకారులు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో ఆయన సహనం కోల్పోయారు. 'కొంచమైనా సిగ్గు ఉందా మీకు? మోడీ చేసిన పనులకు మీరంతా సిగ్గుపడాలి. మోడీ రాష్ట్రానికి ద్రోహం చేశారు. నన్ను డౌన్ డౌన్ అనడం కాదయ్యా. మీ అందరినీ జనాలు తరిమికొడతారు. లేనిపోని సమస్యలు పెట్టుకోవద్దు. మీరు ఫినిష్ అయిపోతారు. నిన్న కూడా తెలుగువాళ్ల మీద ఢిల్లీలో లాఠీచార్జ్ చేయించారు. ఈ గడ్డపై ఉంటూ, ఇక్కడి నీళ్లు తాగుతూ, ఇక్కడి గాలిని పీలుస్తున్నప్పుడు కమిట్ మెంట్ ఉండాలి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హద్దు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.