శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 3 జనవరి 2019 (10:37 IST)

ఏపీకి ఇచ్చిన డ‌బ్బు ఎవ‌రి జేబుల్లోకి వెళ్ళింది?: ప్రధాని మోదీ ప్రశ్న

విశాఖ: విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఏపీలో సాధనాలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ.. అసత్యాలను ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

రూ. 20 వేల కోట్ల వరకు రిసోర్స్‌ గ్యాప్‌, రెవెన్యూ డెఫిసిట్‌ ఫండ్‌గా విడుదల చేశామన్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అందలేదని చెబుతోందని, ఆ డ‌బ్బు ఎవ‌రి జేబుల్లోకి వెళ్ళిందని మోదీ ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు రూ. వెయ్యి కోట్లు ఇచ్చామని, ఏపీ ప్రభుత్వం యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు ఎందుకివ్వలేదన్నారు. 
 
పోల‌వ‌రాన్ని జాతీయ ప్రాజెక్టుగా మా ప్రయ‌త్నంతోనే ప్రక‌టించారని, పోలవరానికి వంద‌శాతం కేంద్రం డబ్బులు ఇస్తోందని తెలిపారు. ఇప్పటివరకు పోలవరానికి రూ. 7 వేల కోట్లు ఇచ్చామని, ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం అడిగిందని మోదీ పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ను ఏపీ నిర్వహించలేకపోతోందని కాగ్‌ రిపోర్ట్‌ చెప్పిందని మోదీ తెలిపారు.
 
‘‘విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఏపీలో పది జాతీయ స్థాయి విద్యాసంస్థలను ప్రారంభించాం. భారత్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి... ఇన్ని జాతీయస్థాయి విద్యాసంస్థలు కేటాయించలేదు. 
 
టీడీపీ, కాంగ్రెస్‌ దశాబ్దాలుగా ఏపీని పాలిస్తూ... ఇలాంటి సంస్థలు ఎందుకు ఏర్పాటు చేయలేదు. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం అయినా ఏపీకి ఇంత సాయం చేసిందా? బీజేపీ ఏపీ కోసం ఎంతో చేసింది.. భవిష్యత్‌లోనూ చేస్తుంది. ఏపీకి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడానికి సిద్ధం. అయితే ఇచ్చే డబ్బులు దేనికోసం ఇస్తున్నామో దానికే ఖర్చు చేయాలి’’ అని మోదీ అన్నారు. 
 
అంతకుముందు మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తమ సంక్షేమ పథకాలు సెక్యూరిటీ చుట్టూ తిరుగుతాయని, దేశం లోపలా, బయట భద్రతకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ప్రధాని సురక్షా బీమా యోజన కింద యాక్సిడెంట్‌ పాలసీ తెచ్చామని, నెలకు రూపాయితో ప్రధాని జీవన్‌ జ్యోతి యోజన పథకాన్ని రూపొందించామని మోదీ చెప్పారు.