గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (15:35 IST)

తమిళనాడు ఆవిన్ నెయ్యితో తిరుమల శ్రీవారి లడ్డూలు...

ఆవిన్‌గా పిలవబడే తమిళనాడు కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ ప్రస్తుతం తిరుపతి శ్రీవారి లడ్డుల తయారీ కోసం నెయ్యిని సరఫరా చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)తో ఒప్పందం కుదుర్చుకుంది. నెయ్యి కోసం సంవత్సరంలో రెండుసార్లు టెండర్లు ప్రకటిస్తారు, ఒక్కో టెండరు వ్యవధి ఆరు మాసాలు పాటు ఉంటుంది. అయితే అముల్ పాల సంస్థ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద సంస్థగా పరిగణించేటువంటి కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎమ్ఎఫ్) 2015 వరకు దాదాపు దశాబ్ద కాలం పాటు నెయ్యిని సరఫరా చేసింది. ఆ తర్వాత బిడ్ మహరాష్ట్ర కంపెనీకి వెళ్లింది.
 
ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత తమిళనాడులో ఫేమస్ అయిన ఆవిన్ నెయ్యితో తిరుపతి వెంకన్న స్వామికి లడ్డూ ప్రసాదాలు తయారు కానున్నాయి. 7 లక్షల 24 వేల కిలోల నెయ్యిని సరఫరా చేసేందుకు ఆవిన్ సంస్థ ఆంగీకరించింది. దీని ద్వారా సంస్థకు దాదాపు రూ. 23 కోట్ల రూపాయల ఆదాయం రానున్నట్లు ఆవిన్ వర్గాలు చెబుతున్నాయి. 
 
ప్రతిరోజూ ఆవిన్ సంస్థ దాదాపు 32 లక్షల లీటర్ల పాలను గ్రామీణ డెయిరీ నిర్వాహకుల నుండి సేకరిస్తోంది. 23 లక్షల 50 వేల లీటర్ల పాలను ప్యాకెట్‌ల రూపంలో విక్రయిస్తోంది. మిగిలిన పాలను కోవ, నెయ్యి, మిల్క్‌షేక్, స్వీట్లు తదితర పాటి తయారీలో వినియోగించుకుంటుంది. వీటిని తమిళనాడులో మాత్రమే కాకుండా హాంకాంగ్, ఖతార్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తుండడం గమనార్హం.