ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (07:18 IST)

మూడు రాజధానుల బిల్లు : బంతి సెలెక్ట్ కమిటీ కోర్టులోకి వచ్చింది.. వాట్ నెక్స్ట్?

ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు బంతి ఇపుడు సెలెక్ట్ కమిటీ కోర్టులోకి వచ్చిచేరింది. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్ర శాసనమండలి సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసింది. దీంతో తాత్కాలికంగా మూడు రాజధానుల ఏర్పాటు అంశానికి బ్రేక్ పడినట్టయింది. అసలు సెలక్ట్ కమిటీ అంటే ఏంటి.. దానికున్న అధికారాలు ఏంటి అనే అంశాన్ని ఇపుడు తెలుసుకుందాం. 
 
శాసనసభ లేదా మండలిలో ప్రభుత్వం బిల్లులను ప్రవేశ పెట్టినప్పుడు... వాటికి ఎవరైనా సవరణలు ప్రతిపాదించవచ్చు. వాటిపై ఓటింగ్ కోరవచ్చు. సభలో బలాబలాలను బట్టి ఈ సవరణలు వీగిపోవచ్చు లేదా గెలవవచ్చూ. 
 
అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన అంశాలపై రూపొందించిన బిల్లుపై సభలో సమగ్రంగా, క్షుణ్ణంగా, అన్ని కోణాల్లో చర్చించే అవకాశం లేకపోవచ్చు. అందుకు సమయం, పరిస్థితులు సహకరించకపోవచ్చు. అలాంటి బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని కోరవచ్చు. 
 
దీనిపైనా ఓటింగ్‌ జరుగవచ్చు. లేదా... సభాధ్యక్షుడు తన విచక్షణాధికారం మేరకు సెలెక్ట్‌ కమిటీకి బిల్లును పంపించవచ్చు. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించడమంటే... సభ దానిని తిరస్కరించినట్లూ కాదు. ఆమోదించినట్లూ కాదు. తాత్కాలికంగా దాన్ని పెండింగ్‌లో ఉంచినట్టన్నమాట. 
 
ఈ సెలెక్ట్ కమిటీ తన నిర్ణయాన్ని నెల రోజులు లేదా గరిష్టంగా మూడు నెలల్లో తన నిర్ణయాన్ని తెలుపాల్సి ఉంటుందని చెబుతారు. కానీ... ఇది ఖచ్చితమైన నిబంధనేమీ కాదు. మరింత చర్చించాల్సిన అవసరముందనిపిస్తే గడువు పొడిగించుకుంటూ వెళ్లవచ్చు. ఆయా అంశాలపై సంబంధిత రంగాల నిపుణులతోనూ చర్చించి వారి అభిప్రాయాలను తీసుకోవచ్చు.
 
ఈ సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు ఉంటారన్న సందేహం తలెత్తవచ్చు. ఈ కమిటీలో 9 మంది వరకు సభ్యులు ఉండవచ్చు. 3 రాజధానుల అంశంపై నియమించబోయే సెలెక్ట్‌ కమిటీలో విపక్ష టీడీపీ నుంచి ఏడుగురు ఉండే అవకాశముంది. సభలో ఆయా పార్టీల సభ్యుల సంఖ్యను బట్టి నిష్పత్తి ప్రకారం ఎంపిక చేస్తారు. 
 
శాసనసభకు, మండలికి వేర్వేరుగా సెలెక్ట్‌ కమిటీలు ఉంటాయి. ఉమ్మడిగానూ ఈ సెలెక్ట్‌ కమిటీలను నియమించవచ్చు. ఇప్పుడు నియమించబోయే కమిటీలో మండలి సభ్యులే ఉంటారు. కానీ మెజారిటీ సభ్యుల అభిప్రాయమే చెల్లుబాటు అవుతుంది. ఈ కమిటీకి బిల్లును ప్రవేశపెట్టిన సంబంధిత శాఖ మంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. ఈ లెక్కన చూసుకుంటే ఈ సెలెక్ట్ కమిటీలో కూడా విపక్షానికే మెజార్టీ ఉండనుంది.