1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (09:50 IST)

జేసీ, పెద్దారెడ్డి వర్గాల మధ్య మరో వివాదం!... పోలీసుల ముందస్తు జాగ్రత్తలు

తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గాల మధ్య ఆలయ వివాదం రాజుకుంటోంది. మరోసారి వర్గకక్షలు భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దపప్పూరు మండలం శ్రీవజ్రగిరి లక్ష్మినరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం టీడీపీ వర్గం తలపెట్టిన సుదర్శన మహాయాగం ఇందుకు వేదిక కానుంది.

కొవిడ్‌ నుంచి ప్రజల విముక్తి, వర్షాలు సకాలంలో కురవాలన్న సంకల్పంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచనల మేరకు దేవాలయ పాతకమిటీ పెద్దఎత్తున సుదర్శనమహాయాగం చేపట్టింది. ఇందుకు పోటీగా తాము కూడా అదే సమయంలో దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భారీఎత్తున నిర్వహించేందుకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గానికి చెందిన నూతన పాలక వర్గం నిర్ణయించింది.

ఈ యాగానికి సంబంధించి రెండురోజులక్రితం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్దపప్పూరు మండలం జూటూరుకు వెళ్లి పాతకమిటీ సభ్యులతో సమావేశమై నిర్వహణ గురించి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మనకు పోటీగా వైసీపీ వర్గీయులు కూడా దేవాలయంలో పూజలు జరిపేందుకు సిద్ధమయ్యారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఎవరుచేసినా చేయకపోయినా ముందుకు అనుకున్నట్లు మనం చేసి తీరాలని ఆయన వారిని కోరినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసుశాఖ అప్రమత్తమైంది. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని రెండువర్గాలను దేవాలయం చుట్టుపక్కలకు రాకుండా ఎస్‌ఐ గౌస్‌ మహమ్మద్‌ ఆధ్వర్యంలో భారీబందోబస్తు ఏర్పాటుచేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.