ఈ యేడాది కరెంట్ చార్జీలు పెంచం : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ఈ యేడాది కూడా కరెంట్ చార్జీలు పెంచబోమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. బుధవారం సచివాలయంలో సీఎం అధ్యక్షత మంత్రులు, ఆయాశాఖధిపతులు, కార్యదర్శులు, హెచ్.ఓ.డీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, వృద్ధిరేటు పెంపునకు తీసుకోవాల్సిన అంశాలు, అమలు ప్రణాళికపై ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 'అనంతపురం వేరుశనగ రైతులకు దేశంలోనే తొలిసారి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఆ జిల్లాలో కరవు తీర్చేందుకు ఇజ్రాయెల్ సాంకేతికతను పరిశీలించాం. రాయలసీమలో పశువులకు గడ్డి కూడా దొరకని పరిస్థితి ఉండేది. అనంతపురం జిల్లాలో నాణ్యమైన వేరుశనగ పండేలా చర్యలు చేపట్టామన్నారు.
అన్నా హజారే, రాజేంద్రసింగ్ స్ఫూర్తితో జలసంరక్షణ చేపట్టాం. రాయలసీమలో ఇప్పుడు భూగర్భజలాలు పైకి వచ్చాయి. భూగర్భజలాలు 3 మీటర్లకు చేరితే ఖర్చుపెట్టే బడ్జెట్ తగ్గుతుంది. సౌరశక్తి వినియోగించుకుంటే విద్యుత్ డిమాండ్ బాగా తగ్గుతుంది. ఈ ఏడాది కరెంట్ ఛార్జీలు పెంచం. దేశంలో ఇండస్ట్రియల్ పార్కులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదే' అని చంద్రబాబు అన్నారు.
ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదు... అసలు అనవసరమైన ఫైళ్లను సృష్టించే విధానానికే స్వస్తి పలకాలి. పాలనను సులభతరం చేసేందుకు అధికారులు అనవసర నిబంధనలను తొలగించాలి అని ఆయన సూచించారు. ప్రతి శాఖలో సమూల మార్పులు తీసుకురావాలని, టెక్నాలజీ, డేటాలేక్ వంటి ఆధునిక విధానాల ద్వారా పాలనను మరింత సమర్థవంతంగా అందించాలని కోరారు.
ప్రతిశాఖలో తప్పనిసరిగా ఆడిటింగ్ జరగాలని ఆదేశించారు. ఏ అధికారి, ఏ శాఖ పనితీరు ఎలా ఉందనే దానిపై ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని హెచ్చరించారు. గడిచిన 18 నెలల పాలనపై సమీక్ష చేసుకుని, భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని అధికారులు పని చేయాలని కోరారు.