శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (17:22 IST)

మానవ అక్రమ రవాణా అడ్డుకట్టకు కేంద్రీకృత విధానం అవసరం : ఏపీ గవర్నర్

మానవ అక్రమ రవాణాను కేంద్రీకృత విధానంతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవటానికి ప్రజ్వల సంస్థ రూపొందించిన హ్యాండ్ బుక్స్‌ను గవర్నర్ హరిచందన్ ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఎదుర్కునే క్రమంలో రూపొందించిన స్నేహ పూర్వకమైన ఈ ఐదు చేతి ప్రతులు ఉపయోగకరంగా ఉంటాయని, అక్రమ రవాణాను నివారించడంలో పాటు, సమస్యను పరిష్కరించడంలో మార్గదర్శకత్వం వహిస్తాయని అన్నారు. 
 
జ్యుడిషియల్ ఆఫీసర్లు, ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, లేబర్ ఆఫీసర్లు, సివిల్ సొసైటీ సంస్థల నిర్వహకులకు ఈ పుస్తకాలు సహాయకారిగా ఉంటాయన్నారు. ‘హ్యాండ్‌ బుక్ ఆన్ కౌంటర్ హ్యూమన్ ట్రాఫికింగ్’ పేరిట వీటిని తీర్చి దిద్దటం మంచి ప్రయత్నమన్నారు. 
 
మానవ అక్రమ రవాణా కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఉపకరించే విధంగా ప్రస్తుత చట్టాలు, విధానాలు, తీర్పులను ఈ పుస్తకాలలో సమకూర్చారని, ‘నివారణ, రక్షణ, పునరావాసం, పున-సమైక్యత’ ఉద్దేశ్యంతో అక్రమ రవాణా, సంబంధిత నేరాలపై మార్గదర్శక కృషి చేసినందుకు సునీతా కృష్ణన్, ఆమె బృందాన్ని గవర్నర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.