గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (18:51 IST)

ఆంధ్రప్రదేశ్‌లో లాక్డౌన్? క్లారిటీ ఇచ్చిన ఏపీ సీఎం జగన్

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను కట్టడి చేసేందుకు కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయినప్పటికీ ఫలితం పెద్దగా కనిపించడం లేదు. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో రాత్రి నిర్భంధంతో పాటు కొన్నిచోట్ల లాక్డౌన్ కొనసాగుతోంది. 
 
తాజాగా లాక్‌డౌన్ నిర్ణయంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖలో నాడు- నేడు కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా నిర్భంధం విధించడం వలన ఆర్థికంగా నష్టపోతామన్నారు. గతేడాది అమలు చేసిన లాక్డౌన్ వలన ఏపీకి రూ.21 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 
 
రాష్ట్రంలో మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొన్నటివరకు వందల్లో ఉన్న కేసులు ప్రస్తుతం 2 వేలకు పైగా చేరుకున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ పంపిణీలో వేగం పెంచాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ముందుగా దృష్టిసారించాలన్నారు. 
 
గ్రామాల్లో రోజుకు 4లక్షలు, అర్బన్‌ ప్రాంతాల్లో 2లక్షల డోసులు అందజేయాలన్నారు. వాక్సినేషన్‌ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు, ఆశావర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కరోనా రోగులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.