గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:46 IST)

మరోమారు లాక్డౌన్.. 9 నుంచి 19 వరకు సంపూర్ణ బంద్ .. ఎక్కడ?

దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. రోజుకు లక్ష మందికిపైగా ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలను తీసుకున్నాయి. ఇప్పటికే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రాంతాల్లో తాత్కాలిక లాక్డౌన్‌ను అమలు చేస్తున్నాయి. 
 
ఇపుడు ఇదే కోవలో తాజాగా ఛత్తీస్‌గడ్‌ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఛత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో 11 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్‌ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ లాక్డౌన్ ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి 19 వరకు అత్యవసర సేవలు మినహా మొత్తం బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. 
 
కాగా, ఛత్తీస్‌గడ్‌లో మంగళవారం 9,921 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్యధికంగా రాయ్‌పూర్‌లోనే వెలుగుచూశాయి. దీనితో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌ వైద్య అధికారులతో సుదీర్ఘ చర్చ జరిగి రాజధానిలో లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఏప్రిల్ 14వ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోవుంది.