శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 19 జులై 2019 (15:04 IST)

గ్రామ వలంటరీ పోస్టులకు బీటెక్, పీజీ నిరుద్యోగులు.. ఏపీ ముఖ్యమంత్రి పెద్దారెడ్డేనంట!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో కొత్త సర్కారు ఏర్పాటైంది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటైన ప్రజల చెంతతే ప్రభుత్వ పథకాల పథకం కోసం చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఓ గ్రామ వలంటీర్ చొప్పున నియమిస్తున్నారు. 
 
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగుల్లో ఇంజనీరింగ్, బీటెక్, బీఈడీ, బీకాం, పీజీ, కంప్యూటర్ సైన్స్ కోర్సులు పూర్తిచేసిన వారు ఉండటం గమనార్హం. 
 
ఈ పరిస్థితుల్లో అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ వలంటీర్ల పోస్టుల భర్తీ కోసం ఇటీవల నియామకాలు జరిగాయి. ఈ ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఓ అభ్యర్థి చెప్పిన వింత సమాధానంతో ఇంటర్వ్యూ చేస్తున్న అధికారులు నివ్వెరపోయారు. 
 
ఈ మండలంలో గురువారం గ్రామ వలంటీర్ల పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ ఇంటర్వ్యూలో అధికారులు రాష్ట్ర సీఎం ఎవరని ప్రశ్నించినపుడు ఓ అభ్యర్థి పెద్దారెడ్డి అంటూ సమాధానం ఇచ్చారు. అయితే అధికారులు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి ఎవరంటూ గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆ అభ్యర్థి మరింత గట్టిగా.. "నన్ను తికమక చేయవద్దంటూ పెద్దారెడ్డే ముఖ్యమంత్రి" అని మరోసారి సమధానం చెప్పడంతో అధికారులు నవ్వుకున్నారు.