శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 జులై 2019 (14:18 IST)

ఏపీలో ఫీజుల పెంపునకు చెక్... చట్టసవరణ దిశగా సీఎం అడుగులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీల్లో నానాటికీ పెరిగిపోతున్న ఫీజులను నియంత్రించేందుకు వీలుగా చట్టసవరణ చేయనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం చట్ట సవరణ చేయనుంది. 
 
సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఏపీ మంత్రి మండలి గురువారం అమరావతిలో సమావేశంకానుంది. ఇందులో అసెంబ్లీ ముందుకు తీసుకుని రావాలని భావిస్తున్న దాదాపుగా 12 సవరణ బిల్లులలకు సవరణ చేసే అంశంపై చర్చించనున్నారు. ఈ మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్న చట్ట సవరణల ప్రతిపాదనలను పరిశీలిస్తే, 
 
* రాష్ట్రంలో లోకాయుక్త నియామకానికి సంబంధించి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించేలా తెలంగాణా తరహాలో చట్ట సవరణ చేపట్టనున్నారు. 
* విద్యుత్ నియంత్రణ మండలి సిఫార్సుల అమలుకు సంబంధించిన అంశంలోనూ చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 
* జ్యుడీషియల్ కమిషన్ నియామకం కోసం ఏపీ ఇన్​ఫ్రా డెవలప్​మెంట్ ఎనేబిలింగ్ చట్టం 2001 కీ సవరణ చేయనున్నారు. 
* మౌలిక సదుపాయాల కల్పన, ఇంజినీరింగ్ ప్రాజెక్టుల్లో సమీక్ష కోసం ఈ జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కమిషన్ ఏర్పాటు కోసం చట్ట సవరణ అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. 

* ఇక పాఠశాలలు, కళాశాలల్లో ఫీజు నియంత్రణకు సంబంధించి కమిషన్లను ఏర్పాటు చేసేందుకు నూతన బిల్లులను శాసనసభ ముందుంచనుంది. రాష్ట్రంలో వైద్యారోగ్యానికి సంబంధించిన సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్న ప్రభుత్వం జిల్లా ఆస్పత్రులకు స్వయంప్రతిపత్తి కల్పించేలా సొసైటీలు, ట్రస్టుల కిందకు తీసుకువచ్చేందుకు అవసరమైన చట్ట సవరణను తీసుకురానుంది. 
 
* హిందూ ధార్మిక చట్టానికీ... తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్, పాలక మండలి సభ్యులను ఎప్పుడైనా రీకాల్ చేసేందుకు అవకాశం కల్పించేలా హిందూ ధార్మిక చట్టానికి సవరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపైనా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. రెవెన్యూతో పాటు కార్మిక శాఖకు సంబంధించిన రెండు అంశాల్లోనూ చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం శాసనసభ ముందుంచనుంది.