1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Local body election process postponed: SEC issues notification

ఆంధ్రప్రదేశ్‌లో 'పుర పోరు' వాయిదా... ఎస్ఈసీ ప్రకటన

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురపాలక సంస్థలకు నిర్వహించతలపెట్టిన ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదావేసింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసే చర్యల్లో భాగంగా, ప్రసుత్తం లాక్‌డౌన్ అమల్లోవుంది. ఇది ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ ఎన్నికలను మరికొంతకాలం వాయిదావేస్తున్నట్టు ఎస్ఈసీ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
పైగా, తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఎస్ఈసీ స్థానిక అధికారులను కోరింది. కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడం, లాక్‌డౌన్, హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిలిపివేతను కొనసాగిస్తామని ఆ ప్రకటనలో  పేర్కొంది. 
 
రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలించాక ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కాగా, కరోనా దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థలను గత మార్చి 15 నుంచి తొలుత 6 వారాలు వాయిదా వేశారు. ఈ గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కనగరాజ్ బుధవారం సమీక్షించారు.
 
నిజానికి కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న సమయంలోనే ఈ ఎన్నికలను అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదావేశారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిమ్మగడ్డనా... లేక నేనా అంటూ మీడియా సమావేశం పెట్టిమరీ విమర్శించారు. 
 
ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేశారన్న నెపంతో రమేష్ కుమార్ పదవీకాలాన్ని కుదించి.. ఆ పదవి నుంచి దొడ్డిదారిన జగన్ సర్కారు తప్పించింది. ఈ వ్యవహారం ఇపుడు హైకోర్టులో నడుస్తోంది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఉత్తరప్రదేశ్‌-28మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్