గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 మే 2020 (18:33 IST)

ప్రాణాలను ఫణంగాపెట్టి ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తున్నాం .. మద్యం బాబుల కామెంట్స్

తమ ప్రాణాలన ఫణంగా పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోతున్నట్టు మద్యం బాబులు కామెంట్స్ చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ పుణ్యమాని దేశ వ్యాప్తంగా 46 రోజుల తర్వాత మద్యం దుకాణాల దేశంలో తెరుచుకున్నాయి. దీంతో మద్యంబాబులు వైన్ షాపులకు ఎగబడ్డారు. అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలకు తూట్లు పొడిచి... కిలోమీటర్ల మేరకు బార్లు తీరారు. వీటిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. వీటిపై మద్యంబాబులు తమదైనశైలిలో స్పందించారు. 
 
తమకు ధరలు ముఖ్యం కాదని, కిక్ ముఖ్యమంటున్నారు. దేశం కష్టకాలంలో ఉన్న తరుణంలో తాము డొనేషన్లు ఇస్తున్నట్లుగానే భావించాలన్నారు. కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయని, ఇపుడు తాము మద్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా కొంతమేరకు ఆదుకుంటున్నట్టు చెప్పారు. 
 
ఇలాంటి తరుణంలో కరోనా సోకకుండా తమను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని చెబుతున్నారు. ఎక్కువ సేపు లైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా త్వరత్వరగా అమ్మకాలు జరిపేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
కాగా,ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం 25 శాతం, మంగళవారం 50 శాతం ధరలు పెంచింది. మొత్తం 75 శాతం ధరలు పెంచుతూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అటు కేజ్రీవాల్ సర్కారు కూడా మద్యం ఏకపక్షంగా 70 శాతం ధరలు పెంచింది. 
 
మద్యం ధరల పెంపుపై మరిన్ని రాష్ట్రాలు జగన్ నిర్ణయాన్ని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న రాష్ట్రాలు మద్యం ధరలు అమాంతం పెంచడమే ఏకైక మార్గమని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.