ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 మే 2020 (13:42 IST)

ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు చేశారా? లేదా? హైకోర్టు ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు చిక్కుల్లో పడ్డారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని, అంటు వ్యాధులు వ్యాప్తి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారనే అభియోగాలు ఉన్నాయి. ఇదే అంశంపై హైకోర్టు ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. పైగా, ఈ ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు చేశారా? లేదా? అని ప్రశ్నించింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి అధికార వైకాపా ఎమ్మెల్యేలు, నేతలే కారణమంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. లాక్‌డౌన్‌ సమయంలో వైసీపీ నేతలు నిబంధనలు అతిక్రమించారని వేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. 
 
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయవాది ఇంద్రనీల్‌ వాదనలు వినిపించారు. ఈ వాదనలను ఆలకించిన హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని డీజీపీ, ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా, ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. 
 
ఎవరూ కూడా జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని, అంటువ్యాధులు వ్యాప్తి నిరోధక చట్టాన్ని ఉల్లంగిస్తూ ఎలాంటి జన సమూహాన్ని పోగు చేయరాదని గతంలో కోర్టులు స్పష్టంచేశాయని హైకోర్టు గుర్తు చేసింది. అంతేకాదు.. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు చేశారా..? లేదా..? 
 
నిబంధనలను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యల ఏంటి..? అని హైకోర్టు ప్రశ్నించింది. కాగా వారంలోగా ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు స్పందించి వివరణ ఇచ్చుకోవాలి. అయితే వీరంతా ఏమని వివరణ ఇచ్చుకుంటారా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
ఈ నోటీసులు జారీచేసిన వారిలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా రెడ్డి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కిలివేటి సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినిలు ఉన్నారు.