శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 9 మే 2020 (21:31 IST)

చంద్రబాబు పేపర్ పులి.. టీడీపీది చవట దద్దమ్మల కమిటీ: కొడాలి నాని

చంద్రబాబు పేపర్ పులి అని, టీడీపీది చవట దద్దమ్మల కమిటీ రాష్ర్ట పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

"విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదంలో 12 మంది చనిపోవడం...కొంతమంది తీవ్రంగా అస్వస్ధతకు గురై చికిత్స పొందుతున్నారు.ఆ ఘటన వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి రాష్ర్టప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్  చెప్పారు.
 
అంతేకాక జరిగిన సంఘటన దురదృష్టకరమని, చనిపోయినవారి కుటుంబసభ్యులకు,చికిత్స పొందుతున్నవారికి అండగా ఉంటామని స్పష్టంగా చెప్పారు. ఆ గ్రామాలలో ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం....ఆర్ధికసహాయం చేస్తాం.వైద్యపరంగా ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా హెల్త్ కార్డులు ఇచ్చి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు.
 
జరిగిన సంఘటనపై ఐదుగురు ఐఏఎస్ అదికారులతో కమిటీ వేసి సంఘటన ఎందుకు జరిగింది.ఎలా జరిగింది.ఈ ఫ్యాక్టరీ ఆ ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడి ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి.వీటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చారు.
 
అదే విధంగా సంఘటన జరిగిన ఏడెనిమిది గంటలలో ముఖ్యమంత్రిగారు విశాఖపట్నం వెళ్లి ఆస్పత్రులలో ఉన్న బాధితులను పరామర్శించారు.యోగక్షేమాలు తెలుసుకుని దేశంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తున్నానని ప్రకటించారు.
 
వెంటిలేటర్ పై ఉన్న వారికి వైద్యఖర్చులు ప్రభుత్వమే భరించి పదిలక్షల రూపాయలు ఆర్ధిక సహాయం,ఆస్పత్రిలో చేరిన ప్రతి వ్యక్తి లక్షరూపాయలు ఇస్తామని మనస్సున్న ముఖ్యమంత్రిగా స్పందించారు. అక్కడి ప్రజలు వెంటనే గ్రామాలకు వెళ్లేందుకు వీలులేదు కాబట్టి ఐధుగురు మంత్రులను తీసుకువెళ్లి ప్రజలకు కావాల్సిన వసతి,భోజన సదుపాయం కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు.
 
గ్యాస్ ప్రభావం తగ్గేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో,వాటిని పరిశీలించి తక్షణం ఆ ప్రాంతాన్ని స్వఛ్చమైన గాలి వీచేవిధంగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని,డిజిపిని, మొత్తం ప్రభుత్వాన్ని వైజాగ్ లో పెట్టి వారికి సహాయం అందించేందుకు వైయస్ జగన్ పూనుకున్నారు.

ఈరోజు మీడియాలో చూశాం.చనిపోయిన 12 మంది కుటుంబసభ్యులు,వారి బంధువులు ఆ ప్రాంతంలో పరిశ్రమ ఉంటే .. ప్రమాదం జరిగితే కుటుంబసభ్యులను పొగొట్టుకోవాలని,ఈ పరిశ్రమ వల్ల వారి ప్రాణాలకు ఇబ్బంది అని చెప్పి ఆందోళన చేయడం,మా మంత్రులు వెళ్లి వారితో మాట్లాడటం, డిజిపిగారు మాట్లాడటం జరిగింది.
 
సంఘటనపై రిపోర్ట్ వచ్చాక ఆ పరిశ్రమ ప్రాణాంతకం అని భావిస్తే తప్పకుండా ఆ పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిల్లిలా ఇంట్లో దాక్కున్నాడు.ఈ మధ్య ఆయన పేపర్ పులి అయిపోయాడు.ఓ పేపర్ పట్టుకుని దానిపై ఏదో ఒకటి రాసి కేంద్రప్రభుత్వానికి,ముఖ్యమంత్రికి పంపిస్తున్నాడు.
 
ముగ్గురుతో కమిటీ వేశాడంట. అచ్చెన్నాయుడు.. ఇతను ఎలాంటి వ్యక్తో అందరికి తెలుసు,డ్రామానాయుడు అంటే పాలకొల్లు ఎంఎల్ ఏ రామానాయుడు ఆయన ఏ రకంగా డ్రామా రక్తికట్టిస్తాడో అందరికి తెలుసు,చినరాజప్ప పేకలో జోకర్ లాంటి వాడు. ఇటువంటి ముగ్గురు వ్యక్తులను పెట్టి చంద్రబాబు ఓ కమిటి వేశాడు.

వీళ్లు నిపుణుల కమిటీ అంట.ముఖ్యమంత్రి ఐఏఎస్ లతో వేసిన కమిటీ పనికిరాదంట.కేంద్రప్రభుత్వం వేసిన కమిటీ కూడా వారి దృష్టిలో పనికిరాని కమిటీనే. చంద్రబాబు వేసిన కమిటీ.... చవట దద్దమ్మల కమిటీ.... అది బ్రహ్మాండమైనదంట.వాళ్లు అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తారని చెబుతున్నారు.
 
అచ్చెన్నాయుడు చెబుతున్నాడు....పరిశ్రమకు వైయస్ జగన్ అండగా ఉండి, ప్రజలకు అన్యాయం చేస్తారని ఈయనకు అనుమానం వచ్చిందంట.జగన్, చంద్రబాబులాగా తప్పుడు విధానాలతో నడిచే తప్పుడు లక్షణాలు ఉన్న వ్యక్తి కాదు..... నీకు అనుమానం రావడానికి. జగన్ ఆస్ధులు పోయినా,ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్ధితి వచ్చినా, ఇచ్చినమాట కోసం ఆయన కష్టాలు అనుభవించి ప్రజలకోసం నిలబడిన మగాడు జగన్మోహన్ రెడ్డి.

చంద్రబాబులాగా అటూ ఇటు కానోడు కాదు.అటు వెళ్తే వారి మాట...ఇటు వెళ్తే వీళ్ల మాట.అవసరం కోసం గోతులు తవ్వడం,వెన్నుపోటు పొడవడం జగన్గా, వైయస్ రాజశేఖరరెడ్డి రక్తం లో లేదు.ఈరోజు నీతులు చెప్పే చంద్రబాబు...ముఖ్యమంత్రిగా ఉండగా....1998లో ఇదే కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.అనేక మందికి తీవ్రగాయాలు అయితే ఆరోజే కంపెనీని ఎందుకు మూసేయలేదు.

ఇప్పటికీ జీవచ్చవాల్లాగా ఉన్నవారు ఉన్నారు.14 ఏళ్లు సిఎంగా పనిచేసి ఎందుకు మూయించలేదు. ఆరోజు చంద్రబాబునాయుడు బ్రోకర్ పనిచేశాడు.అది హిందూస్ధాన్ పాలిమర్స్ అని ప్రైవేటు కంపెనీ... మీడియేషన్ చేసి కొరియన్ కంపెనీకి అమ్మిన బ్రోకర్ చంద్రబాబు.ఆరోజు జనం తక్కువ ఉన్నారంట.ఈరోజు చుట్టుపక్కల జనం ఎక్కువైపోయారని చెబుతున్నారు.
 
ఇదే దద్ధమ్మ చంద్రబాబునాయుడు 2017లో ఆ పరిశ్రమను విస్తరణ చేసుకోమని ఆర్డర్స్ ఇచ్చాడు.కంపెనీని విస్తరిస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి విస్తరించుకోమని ఆర్డర్స్ ఇచ్చారని చెప్పారు.2023 వరకు ఎల్జీపాలిమర్స్ ను పెంచుకుంటూ,అభివృద్ది చేసుకుంటీ వెళ్లేందుకు వీలుగా 2018లో ఆర్డర్స్ ఇచ్చారు.ఆ ప్రాంతంలో జనం అదికంగా నివసిస్తున్నప్పుడు.... విస్తరణకు ఎలా అనుమతులు ఇచ్చాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి.

అదే విధంగా కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తే మనుషులు బతికివస్తారా అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు.అంటే మూడు లక్షల రూపాయలు ఇస్తే బతికి వస్తారని గతంలో ఇచ్చావా? గోదావరి పుష్కరాలలో సినిమా షూటింగ్ పెట్టి బోయపాటి శ్రీనును తీసుకువచ్చి నీవు,నీ పెళ్లాం,నీ కొడుకు,కోడలు,మనవడితో గోదావరి నదిలో స్నానం చేయడానికి వస్తే తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోతే ఎక్స్ గ్రేషియా మూడు లక్షలు ఇచ్చారు.
 
2014లో గ్యాస్ పైపులీకయ్యి 18 మంది చనిపోతే వారికి 20 లక్షలు గెయిల్ కంపెనీవారు ఇస్తే, ఈ సన్నాసి చంద్రబాబు ముష్టి మూడు లక్షల రూపాయలు ఇచ్చాడు.రెండులక్షల రూపాయలు ప్రధానమంత్రి ఇచ్చారు.

ఆరోజే జగన్ చెప్పారు... ఇలాంటి యాక్సిడెంట్ లు జరిగితే మిగిలిన కంపెనీలకు భయం ఉండాలంటే...కనీసం కోటి రూపాయలు పరిహారం ఇప్పించినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరిగి చనిపోతే డబ్బులు కట్టాల్సిన పరిస్ధితి ఉంటుంది కాబట్టి కంపెనీలు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తాయి.కోటిరూపాయలు పరిహారం ఇవ్వాలని ఆరోజు డిమాండ్ చేశారు.
 
మాట తప్పని వ్యక్తి కాబట్టి జగన్ ఆ కంపెనీ ఎంత ఇచ్చినా ఇవ్వకపోయినా,ఆ విషయం....మేమూ,కంపెనీ కుంటాం.కోటి రూపాయల పరిహారం ఇస్తున్నాం అని చెప్పి మనస్సున్న వ్యక్తిగా కోటి రూపాయల పరిహారం ప్రకటించారు.చంద్రబాబు,తెలుగుదేశం పార్టికి సంబంధించిన వ్యక్తులు,ఆయనకు సంబంధించిన మీడియా దానిని సైతం ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు.
 
జరిగిన సంఘటన దురదృష్టకరం, అలాంటి సంఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు.ఈరోజు ముఖ్యమంత్రి జగన్ పెద్ద మనస్సుతో స్పందించి వారికి బాసట కల్పించాలని,ధైర్యం ఇవ్వాలని గంటల వ్యవధిలో వైజాగ్ వెళ్లి మంత్రులను,సిఎస్,డిజిపిలను పెట్టి పరిస్ధితిని సాధారణ స్దితికి తీసుకురావాలని  ప్రయత్నిస్తున్నారు.
 
పుల్లలు పెట్టడం,పెట్రోల్ పోయడం,కిరసనాయిల్ పోయడం.... చంద్రబాబు దిక్కుమాలిన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు.నీవసలు ప్రతిపక్షనాయకుడివేనా....మనిషివా...దున్నపోతువా....హైద్రాబాద్ వెళ్లి 50 రోజులైంది.మొన్నటివరకు ప్రగల్భాలు పలికావు.మోదిని ఏపిలో అడుగుపెట్టనీయనన్నావు.మోది ఏపి వస్తే ఏ ముఖం పెట్టుకుని వచ్చావు.
ఆయన వస్తే నల్లబ్యాడ్జీలు పెట్టండి.....నల్లబెలూన్లు పెట్టండని కార్యక్రమాలు చేశావు. ఇప్పుడు సిగ్గు,శరం లేకుండా మోదికి చంద్రబాబు లేఖరాశాడు....మా ఊరు వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వండని,నీ దిక్కుమాలిన బతుకు ఏ స్దాయికి వచ్చిందో కూడా అర్ధం చేసుకోలేని పరిస్ధితి లో ఉన్నావు.
 
దేనికి విమర్శ చేయాలి...దేనికి నోర్మూసుకు కూర్చోవాలనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు.70 సంవత్సరాలు నిండాయి.అయినా సిగ్గు,శరం లేదు.మనిషి జన్మఎత్తాననే విషయం మరిచిపోయాడు.ఇంటిదగ్గర ఖాళీగా కూర్చొని,ముక్కులో ఆక్సిజన్ పైపులు తోసుకుని, ఎవడో రాసిన పేపర్ పై సంతకం పెట్డడం రిలీజ్ చేయడం చేస్తున్నాడు.
 
కరోనా వస్తుందనే  భయంతో అద్దాల గదిలో కూర్చుని బయటకు రాడు.వైజాగ్ వెళ్తే ఎవడు ఆపుతాడు నిన్ను.వలస కూలీలు రాష్ర్టాలనుంచి రాష్ర్టాలకు వెళ్తున్నారు.మేం తిరుగుతున్నాం.ఈయన హైద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్తే ఎవరాపుతారు.అక్కడకు వెళ్తే కరోనా అంటుకుంటుందేమో.... వస్తే దెబ్బకు పోతా.ఆ గ్యాస్ పీల్చుకుంటే ఊపిరితిత్తులు పోతాయేమోననే చంద్రబాబుకు భయం.
 
వందేళ్లు రాచపీనుగులాగ బతికి ఉండాలి.అక్కడకు వెళ్లకూడదు.డ్రామాకంపెనీ....ముగ్గురు డ్రామాగాళ్లను అక్కడకు పంపి డ్రామా కమిటీ వేశాడు.చంద్రబాబేమో ఇంటికాడ కూర్చుని ఆక్సిజన్ పైపులు ముక్కులోనుంచి తీయడు. అద్దాలగదినుంచి బయటకురాకుండా వీడియోపెట్టి మీడియాతో మాట్లాడతానంటాడు.లెటర్లపై సంతకాలు పెడతాడు.
 
ఇప్పుటికైనా బుధ్ది పెంచుకో.... నీ బతుకు.... ఏం బతుకు అయిందో ఆలోచించుకో చంద్రబాబూ...వళ్లు దగ్గర పెట్టుకుని విమర్శలు చేయి. నీ దగ్గర ఉన్న 23 మందిఎంఎల్ ఏలలో ముగ్గురు బయటకుపోయారు.ఇంకో ముగ్గురో,నలుగురో పోవడానికి సిధ్దంగా ఉన్నారు.నాలుగురోజులలో ప్రతిపక్షహోదా కూడా పోయే పరిస్ధితిలో తగలడ్డావు.
 
ముఖ్యమంత్రిపైన,ప్రభుత్వంపైన నీవు చేస్తున్న విమర్శలు చూస్తుంటే జనం నవ్వుకుంటారు.ఎక్స్ గ్రేషియా ఇమ్మంటే గతంలో ఏం చెప్పావు.ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు.సోషల్ మీడియాలోగాని,మీడియాలో గాని నాడు-నేడు అని వేసి చూపిస్తున్నారు.అవి చూసైనా సిగ్గుతెచ్చుకోమని చంద్రబాబుకు చెబుతున్నాను.
 
కరోనా కేసులు దాస్తున్నామంట....లక్షా 65 వేలమందికి కరోనా టెస్టులు చేసి దేశంలోనే నంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఆంధ్రప్రదేశ్. అత్యవసరపరిస్ధితులలో 60,70 వేలమంది హాస్పటలైజ్ అయినా కూడా వారిని రక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది.

ముఖ్యమంత్రి నిత్యం సమీక్షలు చేస్తూ ఎంతఎక్కువమందికి టెస్టులు చేయగలిగితే అంతమందికి చేద్దాం.ఒక్క కేసును కూడా దాయాల్సిన అవసరం లేదు.మంచి ట్రీట్ మెంట్ ఇద్దాం.మంచి భోజనం పెడదాం.దేవుడున్నాడు.మానవులుగా మనం చేయాల్సిన కార్యక్రమాలు కొనసాగిధ్దాం.కరోనాతో కలసి జీవించాల్సిన పరిస్ధితి ఏర్పడింది.

వైరస్ కు వ్యాక్సిన్ వచ్చేదాకా కూడా ఇబ్బంది కరమైన పరిస్ధితి ఉంటుంది.పెద్దలు,పిల్లలు, అనారోగ్యసమస్యలున్నవారు ఇంటివద్ద ఉండి మిగిలినటువంటివారు పనులు చేసుకోవాల్సిన పరిస్ధితి ఉంది....కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యి ఉండమని చెబితే దానిపై కూడ చంద్రబాబు సెటైర్లు వేస్తున్నారు.
 
జగన్ నీలాగా ముసలివాడు కాదు...యువకుడు కాబట్టి ఈ వయస్సులో మనం ఎందుకు ఇంటివద్ద కూర్చోవాలి....కరోనా వైరస్ వచ్చినా కూడా అదేమీ ప్రాణాంతకమైనది కాదు.... మనకిచ్చిన బాధ్యతలు నిర్వహించాలి కాబట్టి ఆయన పనిచేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తి. చంద్రబాబూ....కరోనా వైరస్ వస్తే కాటికి పోతావు కాబట్టి ఆక్సిజన్ పైపులు ముక్కులోనే పెట్టుకో అద్దాలరూమ్ లోనే ఉండు.ఎంతకాలం ఉంటావో తెలియదు.ఆఖరి దశలో అయినా బుధ్ది తెచ్చుకుని ప్రజల మన్ననలు పొందు.
 
నీవు ఎంత సన్నాసివో...దొంగవో అందరికి తెలుసు.అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటావని మోదికి కూడా తెలుసు.నీవు ఎన్ని నక్కవినయాలు ప్రదర్శించినా  మోది కనికరించడు.రాబోయే రోజులలో జైలుకు పోవడానికి సిధ్దంగా ఉండు. చంద్రబాబు అనే వాడు బతికిఉన్నాకూడా చచ్చినటువంటి వ్యక్తి.

అతనిని ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్లోనుంచి తీసేసి....అతనిని మీడియాగాని,మనంగాని వదలేస్తే ఈ రాష్ర్టం ప్రశాంతంగా ఉంటుంది. దేవినేని ఉమ పదవి కోసం వదినను చంపిన సన్నాసి....అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని వెల్లడించారు.