గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 4 మే 2020 (22:00 IST)

ప్రతి ఇంటికి మూడు మాస్క్‌లు ఏవీ?: చంద్రబాబు

ప్రతి ఇంటికి మూడు మాస్క్‌లు పంపిణీ చేస్తామన్న మాట గాలికి వదిలేశారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. రైతులు పండించిన పంటలో పదోవంతు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, పంటలకు ధరలు లేక రైతులు నైరాశ్యంతో ఉన్నారని విమర్శించారు.

హైదరాబాద్‌ నుంచి సోమవారం టిడిపి నేతలతో ఆన్‌లైన్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మద్దతు ధరల కోసం రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించడం వైసిపి ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమన్నారు.

హైకోర్టులో ఇటీవల వేసిన అఫిడవిట్‌లో 4,92,977 మెట్రిక్‌ టన్నుల ధాన్యం, మొక్కజన్న 46,660 మెట్రిక్‌ టన్నులు, జన్న 5,693, శనగ 10,872, కందులు 43,261 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించిందని చంద్రబాబు తెలిపారు.

ఆక్వా, సెరికల్చర్‌ ఉత్పత్తులన్నీ కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. క్వారంటైన్‌ కేంద్రాల నుంచి 14 రోజుల తర్వాత ఇంటికెళ్లేవారికి రూ.2 వేలు అందిస్తామన్న హామీ కూడా అమలు కాలేదన్నారు.

వీరందరికీ రూ.ఐదు వేలివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. గోదావరి ముంపు ప్రాంతమైన ఆవ భూముల్లో కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

మద్య నిషేధం పట్ల వైసిపి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని చంద్రబాబు విమర్శించారు. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సడలిస్తే అక్కడ మద్యం దుకాణాలు తెరిచి ప్రజల రక్తం పిండుకోవడం దారుణమని తీవ్రంగా వ్యాఖ్యానించారు.