1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. CID issues notices to YCP MLA Alla Ramakrishna Reddy

అసైన్డ్ భూముల రాజకీయం : వైకాపా ఎమ్మెల్యేకు సీఐడీ నోటీసులు

Alla Ramakrishna Reddy
నవ్యాంధ్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల అంశంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ... టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులు జారీ చేసింది.
 
తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. సీర్పీసీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని ఎమ్మెల్యేకి స్పష్టం చేశారు.
 
కాగా ఈ అంశంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఎం జగన్‌కు ఎవరిపైనా కక్ష సాధించాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. అమరావతి భూముల అంశంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సీఐడీ ముందు హాజరై వివరణ ఇస్తారని వెల్లడించారు.
 
మరోవైపు, ఈ అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. నారాయణకు చెందిన కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగాయి. 
 
ఏక కాలంలో అన్ని చోట్ల సోదాలు చేపట్టగా, ఇన్ని చోట్ల ఒకేసారి సోదాలు జరుగుతుండటం సంచలనంగా మారింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారాయణకు సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు. ఈ నెల 23న విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు జరుపుతోంది.
About Writer
ఠాగూర్