1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Corona tie with Dhanvantari Yagam

ధన్వంతరీ యాగంతో కరోనా కట్టడి: టీటీడీ చైర్మన్

Corona
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బారి నుంచి ఉపశమనం పొందాలంటే ఏప్రిల్ 14 వరకు ప్రతి ఒక్కరూ గడప దాటి బయటకు రావద్దని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు కట్టుబడి, వారి మార్గదర్శకాలతో కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని శుక్రవారం ఓ ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడనే ఉంటే ఈ వైరస్ ప్రభావాన్ని పూర్తిగా నిరోధించడానికి తోడ్పడిన వాళ్లవుతారని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని వార్డు, గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ల బాగోగులు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిస్తూ తగిన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 
 
మూడు వారాల స్వీయ నిర్బంధంలో ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా, ఆహారం అందుబాటులో లేకున్నా 1902, 104 నంబర్లకు కాల్ చేసిన వెంటనే ప్రభుత్వ సిబ్బంది మీ ముంగిట వాలిపోతారు. కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని సుబ్బారెడ్డి వెల్లడించారు. 
 
ప్రకృతిలో కంటికి కనిపించని కరోనా వైరస్ను అణచి వేసేందుకు తిరుమలలో 26 నుంచి ప్రారంభమైన ధన్వంతరి యాగం 28 వరకు కొనసాగుతుందని వైవీ తెలిపారు. ఏడు లోకాల అధిపతుల ఆవాహనతో శ్రీ విష్ణు మంత్రోచ్చారణల మధ్య యాగం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

శాంతి, ధన్వంతరి కలశాలను స్థాపించి మంత్రోచ్చారణల అనంతరం ఆ కలశాల జలాన్ని ఆగమ శాస్త్ర పండితులు ఆకాశంలో సంప్రోక్షణ చేస్తారని ఆయన వివరించారు. యాగ ఫలాలు భక్తులందరికీ చేరి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని సుబ్బారెడ్డి ఆకాంక్షించారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
కేసీఆర్, కేటీఆర్‌లకు ఏపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్