శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (20:08 IST)

ఆకలితో అలమటిస్తున్న తెలుగు విద్యార్థులు.. ఎక్కడ?

కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ కష్టాలపాలయ్యారు. ముఖ్యంగా వలస కూలీలు, ఇతర రాష్ట్రాల్లో చదువుకునే విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. స్వరాష్ట్రాలకు వచ్చేందుకు, వెళ్లేందుకు వీలులేక తాము ఉంటున్న ప్రాంతాల్లోనే అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో పలువురు తెలుగు విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా పట్టణం వైద్య ప్రవేశ పరీక్షల శిక్షణా కేంద్రాలకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ కోచింగ్ తీసుకునేందుకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలి వస్తుంటారు. 
 
అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా లాక్‌డౌన్ విధించడంతో అనేక రాష్ట్రాల విద్యార్థులు కోటాలో చిక్కుకుపోయారు. ఇందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనేక బస్సులను పంపించి, యూపీ విద్యార్థులను వెనక్కి రప్పించుకున్నారు. 
 
అలాగే, ఇక్కడ దాదాపు 200 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. వీరంతా ఇపుడు దీనస్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా, తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు లాక్‌డౌన్ కారణంగా హాస్టళ్లు మూసివేయడంతో తినడానికి సరైన తిండి కూడా లేదని, బిస్కెట్లు తింటూ కడుపు నింపుకుంటున్నామని ఆవేదన వెలిబుచ్చారు. 
 
ఇతర రాష్ట్రాలు కొన్ని తమ విద్యార్థులను స్వరాష్ట్రాలకు తరలించాయని, తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా తమను తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలుగు విద్యార్థులు ఓ వీడియో విడుదల చేశారు. అందులో పలువురు విద్యార్థినులు దీనంగా వేడుకోవడం కలచివేస్తోంది.