1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (19:59 IST)

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ ఎలా కాలు పెట్టిందంటే...

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. ఫలితంగా శనివారం సాయంత్రానికి దేశ వ్యాప్తంగా మొత్తం 24942 కేసులు నమోదయ్యాయి. అలాగే, కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 779గా ఉంది. గత 24 గంటలలో ఏకంగా 1490 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, శనివారం ఒక్కరోజే 56 మంది చనిపోయారు. అలాగే, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5210 అని కేంద్రం వెల్లడించింది.
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిదాటిపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 61 మందికి కరోనా నిర్ధారణ కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,016కి చేరింది. అదేసమయంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో కలిపి 61,266 కరోనా టెస్టులు నిర్వహించినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో  8,141 పరీక్షలు చేయగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1,806 టెస్టులు చేసినట్టు అధికార వర్గాలు వివరించాయి. 
 
ఇదిలావుంటే, శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 19వ తేదీన ఢిల్లీ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలోని కాగువాడ గ్రామంలో ఉన్న తన అత్త ఇంటికి ఓ యువకుడు వచ్చాడు. దీంతో అతన్ని 28 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే, ఈ యువకుడు సిడి గ్రామంలో ఉన్న తల్లి ఇంటికి రహస్యంగా వెళ్లివచ్చాడు. ఫలితంగా ఆ కుటుంబంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. 
 
అంతేకాకుండా, ఈ యువకుడు 67 మందితో కాంటాక్ట్ అయినట్టు అధికారులు గుర్తించారు. వీరిలో 29 మందిని క్వారంటైన్‌కు తరలించారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. అలాగే, కగువాడ, సిడి గ్రామాల మధ్య చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి, ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. అలాగే, పాతపట్నం మండలంలోని 27 గ్రామాలు, హీరా, సరవకోట, కొట్టురు మండలాలను కూడా పూర్తిగా లాక్‌డౌన్ చేశారు.