ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 13 జులై 2021 (22:31 IST)

అర్ధ ఎకరం పొలం కూడా విద్యుత్ సమస్యలతో ఎండిపోకూడదు: శ్రీకాంత్ రెడ్డి

విద్యుత్ సమస్యలు తలెత్తకుండా మెరుగైన విద్యుత్‌ను రైతులకు అందించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటిలోని  ఏపిఎస్పిడిసిఎల్ కార్యాలయంలో ఏపిఎస్ పిడిసిఎల్ ఎస్ఈ శ్రీనివాసులుతో కలసి  రాయచోటి నియోజక వర్గ పరిధిలోని ఆరు మండలాలలోని విద్యుత్ సమస్యలు, వాటి పరిష్కారాలపై శ్రీకాంత్ రెడ్డి సమీక్షించారు.

ప్రస్తుతం రైతులకు అందించిన ట్రాన్స్ ఫార్మర్లకు త్వరితగతిన విద్యుత్ లైన్లును ఏర్పాటు చేయించి సరఫరాను అందించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సామగ్రి కొరత ఉంటే తక్షణమే కొనుగోలు చేయించి పూర్తి చేయించే బాధ్యతను తీసుకోవాలన్నారు. నియోజక వర్గ పరిధిలో ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 470 నూతన ట్రాన్స్ ఫార్మర్లను అందించడం జరిగిందని, ఇంకా 720 ట్రాన్స్ ఫార్మర్లు అవసరమని త్వరితగతిన ఈ ట్రాన్స్ఫార్మర్స్‌ను రైతులకు అందించి, పంటల సాగుకు తోడ్పాటు అందించాలన్నారు.

గత ప్రభుత్వ హయాంలో  సిబ్బంది కొరత, పరికరాలు కొరత  వేధించేదన్నారు. ప్రస్తుతం ట్రాన్స్ ఫార్మర్స్ తో పాటు అందుకు అవసరమైన సామాగ్రిని సకాలంలో అందిస్తున్నారని, అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా కావాల్సినంత సిబ్బంది అందుబాటులోకి వచ్చిందన్నారు. కావున గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు అందించే విద్యుత్ సరపరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. అర్ధ ఎకరం  పొలం కూడా  విద్యుత్ సమస్యలతో ఎండిపోయిందన్న మాట ఎక్కడా రాకూడదని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.
 
జగనన్న కాలనీలలో విద్యుత్ వసతుల కల్పనలో వేగం పెంచాలి...
వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో కరెంట్ వసతుల కల్పన విషయంలో వేగం పెంచాలని అధికారులుకు చీఫ్ విప్ ఆదేశించారు. అలాగే పట్టణ పరిధిలో  రోడ్డు విస్తరణ పనులకు అడ్డంకిగా ఉన్న స్తంభాల తొలగింపు, లైన్ల పునరుద్ధరణ  పనులును కూడా త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇతరత్రా వినియోగదారులకు కూడా అవసరమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సేవలు అందివ్వడంలో మీ పాత్ర సముఖంగా ఉండాలన్నారు.