1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (19:30 IST)

అప్పుల బాధ తాళలేక మరో రైతు ఆత్మహత్య

కర్నూలు జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన రైతు గొల్ల నాగన్న(46) అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన మేరకు గొల్ల నాగన్న తనకున్న 9ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలు సాగుచేశాడు. 
 
బోరుబావిలో నీరు తగ్గిపోవడంతో పంటలు ఎండిపోయి ప్రతిఏటా దిగుబడి తగ్గి నష్టాలపాలయ్యాడు. వ్యవసాయం కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద, బ్యాంకుల్లో సుమారు రూ.12 లక్షల దాకా అ ప్పులు చేశాడు. చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోయానని తరచూ భార్య రామక్కతో ఆవేదన చెందేవాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కూడా ఆవేదనతోనే భోజనం చేశాడు. 
 
అనంతరం బయటకు వెళ్లి వస్తా అని చెప్పి వెళ్లాడు. మంగళవారం ఉదయం గ్రామ సమీపంలో ఓ చెట్టుకు పంచెతో వేసిన ఉరికి వేలాడుతున్న నాగన్నను అటుగా వెళ్తున్న గ్రామస్థులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. ఇతడికి భార్య, ముగ్గు రు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. రూరల్‌ ఎస్‌ఐ సుధాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.