మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (09:08 IST)

సముద్ర తీరంలో హై అలర్ట్‌

తీర ప్రాంతం హై అలర్ట్‌ అయింది. కేంద్ర నిఘా వర్గాల ఆదేశాలతో మెరైన్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. సముద్రంలో వేటాడే బోట్లపై నిఘా ఉంచారు. మరోవైపు తీర గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.

కొత్తగా ఎవరైనా వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే తక్షణం సమాచారం ఇవ్వాలని ప్రజలకు సదస్సుల ద్వారా తెలియజేస్తున్నారు. అంతర్వేది మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి పేరుపాలెం వరకు రేయింబవళ్లు గస్తీ నిర్వహిస్తున్నారు.విశాఖ మెరైన్‌ డీఐజీ కార్యాలయం నుంచి వచ్చిన అదేశాలకు అనుగుణంగా సముద్రంలో వేటాడే బోట్లపై నిఽఘా ఉంచారు. వేటకు వెళ్లే బోట్లు, తిరిగి వస్తున్న బోట్లను ఎప్పటిప్పుడు గమనిస్తున్నారు.

బోటులో ఉండే మత్స్యకారులను, సముద్ర గర్భంలోని పరిస్థితిని ఆరా తీస్తున్నారు. కొత్తగా ఏమైనా బోట్లు వచ్చాయా.. లేదా అనుమానాస్పదంగా బోట్లు సంచరిస్తున్నాయా ? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. అంతర్వేది లైట్‌ హౌస్‌ నుంచి బోట్లకు ఎప్పటికప్పుడు సమాచారం పంపుతున్నారు. విశాఖ కోస్టుగార్డులు కూడా ఎప్పటికప్పుడు తీర ప్రాంత పరిస్థితిని మెరైన్‌ పోలీసుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.
 
మూడు రోజుల నుంచి గ్రామాల్లో మెరైన్‌ పోలీసుల హడావుడి నెలకొనడంతో ప్రజలకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. చివరకు అవగాహన సదస్సుల ద్వారా జరుగుతున్న విషయాన్ని అర్ధం చేసుకుంటున్నారు. నరసాపురం తీరంలో సుమారు 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించింది.

ప్రస్తుతం సీజన్‌ కావడంతో వందలాది బోట్లు వేట సాగిస్తున్నాయి. అయితే తీరంలో మెరైన్‌ స్టేషన్‌ లేకపోవడంతో అంతర్వేది పోలీసులే గస్తీ నిర్వహిస్తున్నారు. పేరుపాలెం నుంచి తూర్పుగోదావరి జిల్లా కరవాక వరకు సుమారు 60 కిలోమీటర్లు అంతర్వేది పరిధిలో ఉంది. రాష్ట్ర పోలీసుల ఆదేశాలతో రేయింబవళ్లు ఎస్‌ఐ రామకృష్ణ అధ్వర్యంలో పోలీసులు తీర ప్రాంతం వెంబడి గస్తీ నిర్వహిస్తున్నారు.