ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

ముస్లింలను అణిచివేసిన చంద్రబాబు : ఇస్లాం ప్రముఖులు

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో ముస్లింల జీవితాల్లో ఆశలు చిగురించాయని ఇస్లాం ప్రముఖులు హజరత్ నూరే దరియా, రెహమతుల్లాహి, ఆస్థాన సజ్జదా నషీన్, డాక్టర్ సయ్యద్ తాజుద్దీన్, అహమ్మద్ ఖాద్రీ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ముస్లింలపై ప్రభుత్వం చిన్నచూవు చూసిందన్నారు. అప్పుడు బిజెపితో జతకట్టిన చంద్రబాబు ముస్లింలను దరిచేరనీయలేదన్నారు. ముస్లింలను అనేకరకాలుగా ఇబ్బందులకు గురిచేశారన్నారు. 
 
ముస్లింల మసీదులు దర్గాలు కూల్చివేయడం, కబ్రిస్థాన్లను అన్యాక్రాంతం చేసుకోవడం జరిగిందన్నారు. ముస్లింల గోడు వినే నాధుడే అప్పుడు ఉండలేదన్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లింలపై అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ముస్లింలను అన్నివిధాలుగా ఆదుకున్నారన్నారు. 
 
తదనంతరం అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు ముస్లింలపై కక్ష పెట్టుకుని పరిపాలన చేశారన్నారు. వీళ్ల ఓట్లు మనకు రావని వీళ్లకు ఏమిచేయకూడదని నిర్ణయించుకుని మంత్రి పదవిని సైతం ఇవ్వలేదన్నారు. ముస్లింల బాధలను గుర్తించిన ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు పాదయాత్రలో ముస్లింలపై అభయహస్తం ఇచ్చారన్నారు. 
 
ఆప్రకారంగా ముస్లింలు ఈసారి జగన్ మోహన్ రెడ్డికి మద్దతు నిచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా మంత్రిమండలిలో ముస్లింలపై ఉపముఖ్యమంత్రి, మైనారిటీ శాఖా మంత్రి పదవినిచ్చారన్నారు. ఇప్పుడు ముస్లింలు సుఖ సంతోషాలతో వున్నారని చెప్పుకొచ్చారు. అంధేరాప్రదేశ్ ఇప్పుడు ఉజాలా ఆంధ్రప్రదేశ్‌గా తయారవుతుందన్నారు. ముస్లింల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో అనేక మంది ఇస్లాం ప్రముఖులు అతి త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రె‌డ్డి‌ని కలిసి తమ అపరిష్కృత సమస్యలను విన్నవించడం జరుగుతుందన్నారు. 
 
తండ్రి బాటలోనే ప్రయాణంచేస్తున్న జగన్ మోహన్ రెడ్డి కూడా ముస్లింలపై అపరిమితమైన ప్రేమాభిమానాలు తప్పక చూపుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హజరత్ సయ్యద్ షా బుఖారీ మసీదు కమిటీ అధ్యక్షులు, సూఫీ మొహమ్మద్ అల్తాఫ్ అలీ రజా మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో ముస్లింల ఆస్తులు సంరక్షించబడతాయన్న నమ్మకం కలుగుతోందన్నారు. గతప్రభుత్వం ముస్లింలకు చేసింది ఏమిలేకపోగా ముస్లిం సమాజాన్నీ అనేకరకాలుగా ఇబ్బంది పెట్టిందన్నారు.
 
అభివృద్ధి పెరటి మసీదులు దర్గాలు, కబ్రిస్థాన్లను కూలదోశారన్నారు. అందుకు ఫలితంగా అధికారాన్ని పోగొట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం గతంలోని తప్పుడు నిర్ణయాలను పక్కన పెట్టి ముస్లింల సంక్షేమం ఎజెండాతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి ప్రభుత్వ ఖాజీ హబీబుల్లా హుస్సేనీ ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యకులు మొహమ్మద్ ముక్తార్ అలీ, రాయలసీమ ముస్లిం లాయర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మక్బుల్ బాషా, భవానీపురం దర్గా కమిటీ నాయకులు మొహమ్మద్ ముస్తాక్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.