శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన ఆహార శిబిరాలు

భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 15 , 16 తేదీల్లో డొక్కా సీతమ్మ  ఆహార శిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

"ఆకలితో వున్నవారికి పని కల్పించి కడుపు నింపాల్సిన ప్రభుత్వమే... ఉన్న ఉపాధిని పోగొట్టి కార్మికుల కడుపు మాడ్చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన నాయకులు, జనసైనికులు వారికి  అండగా ఉండాలి. పస్తులుంటున్న కార్మికుల కోసం డొక్కా సీతమ్మ గారి స్పూర్తితో, 'డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు' ఏర్పాటు చేస్తాం.

పనుల కోసం అడ్డాకు కార్మికులు వచ్చే సమయంలో - అడ్డాల దగ్గరే శిబిరాలు ఏర్పాటు చేసి  ఆహారాన్ని అందిస్తాం.. మా వనరులు పరిమితమేగావచ్చు. కానీ మనకు చేతనైనంత సాయం చేస్తాం. 15 , 16 తేదీల్లో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను నిర్వహిస్తాం.

ఈ శిబిరాలు చూసైనా ప్రభుత్వం కార్మికులకు ఉచితంగా ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ క్యాంటీన్లు ద్వారా అందిస్తారో మరో విధంగానో... కార్మికులకు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆహారం అందించాలి.

నెలల తరబడి పనులు లేకుండా చేసి పస్తులు పెట్టినందుకు కార్మికుల కుటుంబాలకు ఉచితంగా ఆహారం అందించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసే శిబిరాలకు  ఏ రంగైనా వేసుకోండి.. ఏ పేరైన పెట్టుకోండి. కానీ కార్మికులకు ఉచితంగా ఆహారాన్ని అందించాలి.

ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నవారు 50 మంది వరకూ ఉన్నారని భవన నిర్మాణ కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మీరు ఏడు కుటుంబాలకే పరిహారం ఇచ్చారు. అందరికీ ఇవ్వాల్సిందే.

రాజశేఖర్ రెడ్డి మరణం తరవాత 1200 మంది చనిపోయారని ఏ లెక్కలతో చెప్పారో తెలియదుగానీ ఓదార్పు యాత్రలో వారి ఇళ్లకు వెళ్లి లక్షల రూపాయలు ఇచ్చారు. మీ నిర్ణయంతో ఉపాధి లేక 50 మంది వరకూ చనిపోయారని  భవన నిర్మాణ కార్మిక సంఘాలే చెబుతున్నాయి.

మరి ఏ లెక్కలతో ఏడు కుటుంబాలకే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు?  ఇప్పుడు మీ పార్టీ డబ్బు ఇవ్వక్కర్లేదు. ఇల్లు కట్టుకొనే ప్రతి ఒక్కరూ  భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సెస్ చెల్లిస్తారు. ఆ సంక్షేమ నిధి నుంచే పరిహారం ఇవ్వండి" అని ప్రకటనలో పేర్కొన్నారు.