శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (10:55 IST)

ఉపయోగంలోకి ఇంద్రకీలాద్రి కంఠహారం... గడ్కరీ - జగన్ చేతుల మీదుగా ప్రారంభం

బెజవాడ వాసులు కళ్లు కాయలు కాసేలా, సుధీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న ఇంద్రకీలాద్రి కనకదుర్గ వారధి శుక్రవారం నుంచి ఉపయోగంలోకి రానుంది. ఈ వంతెనను కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిలు కలిసి ప్రారంభించనున్నారు. ఇంద్రకీలాద్రికి కంఠహారంగా రూపుదిద్దుకున్న ఫ్లై ఓవర్ శుక్రవారం జాతికి అంకితం చేయనున్నారు.
 
శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో గడ్కరీ, జగన్ చూస్తుండగా, ఏపీ రోడ్లు, భవనాల మంత్రి ఎం శంకర నారాయణ లాంఛనంగా వంతెనపైకి రాకపోకలను ప్రారంభించనున్నారు. ఇదే కార్యక్రమంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ తదితర అధికారులు కూడా పాల్గొంటారు. కాగా, ఈ వంతెనను రూ.501 కోట్లతో నిర్మించిన విషయం తెల్సిందే.
 
అదేసమయంలో ఏపీలో రూ.15,591 కోట్లకు పైగా విలువైన పలు పనులకు మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. న్యూఢిల్లీ నుంచి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ కనకదుర్గపై వంతెన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరో 61 ప్రాజెక్టుల శంకుస్థాపనలతో పాటు, పూర్తయిన 10 ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.
 
కాగా, విజయవాడలో ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి, ఈ వంతెన ప్రారంభంకావడం తప్పనిసరైన పరిస్థితుల్లో, తక్షణమే దీన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు వంతెన ప్రారంభోత్సవం వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత ప్రణబ్ ముఖర్జీ మృతితో, ఆపై గడ్కరీకి కరోనా సోకడంతో రెండుసార్లు ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో వర్చ్యువల్ విధానం ద్వారా దీన్ని ప్రారంభించాలని జగన్ భావించారు.
 
మరోవైపు, రూ.8 వేల కోట్లకు పైగా వ్యయంతో పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు రూ.7,584 కోట్ల విలువైన పనులకు నేడు శంకుస్థాపన జరుగనుంది. నేడు జాతికి అంకితం కానున్న ప్రాజెక్టుల్లో పలు ప్రాంతాల్లోని 532 కిలోమీటర్లకుపైగా రహదారులు, పలు ఆర్వోబీలు ఉండటం గమనార్హం.