బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (10:47 IST)

దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు ఎన్ని?

దేశంలో కరోనా వైరస్ ఉధృతి కాస్త శాంతించిందని చెప్పొచ్చు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత నెల రోజుల క్రితం రోజుకు 90 వేలకు పైచిలుకు కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 65 వేల లోపుకు పడిపోయాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 63,371 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,70,469 కి చేరింది.
 
ఇకపోతే, గ‌త 24 గంట‌ల సమయంలో 895 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,12,161 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 64,53,780 మంది కోలుకున్నారు. 8,04,528 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,22,54,927 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,28,622 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
అలాగే, తెలంగాణాలో నమోదవుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే, రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,554 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,435 మంది కోలుకున్నారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ఇకపోతే, ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,19,224కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,94,653 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,256 కు చేరింది. ప్రస్తుతం 23,203 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 19,251 మంది హోం క్వాంరంటైనులో చికిత్స పొందుతున్నారు. గురువారం ఒక్కరోజులో తెలంగాణ వ్యాప్తంగా 43,916 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 37,46,963 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.